- వీ హెచ్ పీ ఆధ్వర్యంలో కార్యక్రమం..
- దేవాలయాల వ్యవస్థ పెను ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం
చేస్తున్న వీహెచ్పీ నేత డాక్టర్ సురేంద్ర జైన్ - టీటీడీతో సహా ఇతర దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని డిమాండ్..
- ప్రభుత్వాలు హిందువుల మనోభావాలు, సమస్యలను అర్ధం చేసుకోవాలని వినతి
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భక్తుల విశ్వాసాలు, మనోభావాలే కాకుండా.. దేవాలయాల వ్యవస్థ పెను ప్రమాదంలో పడిందని అన్నారు.

అందుకే వీహెచ్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు హిందువుల మనోభావాలు, సమస్యలను అర్ధం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయాల్లో భక్తులు సమర్పించే ముడుపులు అధికారులు, పాలక మండళ్ల ద్వారా దుర్వినియోగం అవుతున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
టీటీడీతో సహా ఇతర దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందు కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.