భాగోతాన్ని బయటపెట్టిన పోలీసులు..
అక్టోబరు 18న ప్రభుత్వ పాఠశాల వద్ద వ్యక్తి శవం
నరబలిగా నమ్మించేందుకు హంతకులు ప్రయత్నం
పోలీసుల దర్యాప్తులో బయటపడిన వాస్తవాలు
రెండు వారాల కిందట ఓ వ్యక్తి హత్యకు గురికాగా.. గొంతు కోసి ఉండడం, మృతదేహానికి సమీపంలోనే క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కానరావడంతో పోలీసులు నరబలిగా అనుమానించారు. కానీ, దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేయడంతో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతడ్ని హత్యచేసి నరబలిగా నమ్మించే ప్రయత్నం చేశారని తేలింది. దీని వెనుక భార్య, ఆమె ఇద్దరు ప్రియుల ఖతర్నాక్ ప్లాన్ ఉందని పోలీసులు గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని నిర్దారణ అయ్యింది. దీంతో కర్ణాటకలో గత నెల 18న జరిగిన హత్య కేసు చిక్కుముడి వీడిపోయింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం. మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా మడువిహళ్లి ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో అక్టోబరు 18న సదాశివ (45) అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఆయన గొంతు కోసి ఉండటం, మృతదేహానికి సమీపంలోనే క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు, రూ.100 నోటు లభ్యం కావడంతో పోలీసులు దీనిని నరబలిగా అనుమానించారు. దీనిపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టడంతో భార్య, తన ఇద్దరు ప్రియులతో కలిసి పక్కా పథకంతోనే ఈ హత్య చేసినట్టు వెల్లడయ్యింది.