అన్నదమ్ములంటే కలిసి మెలిసి ఉండాలి. అలా అని చెప్పడానికి ‘రామలక్ష్మణుల్లా ఉండాలి!’ అని పెద్దలు చెప్పడం వింటూ ఉంటాం. రాముడు-లక్ష్మణుడు రెండు పేర్లూ విడిగాకన్నా ఏకనామంగా ‘రామలక్ష్మణులుగానే’ ప్రసిద్ధం! ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కవల పిల్లల్లా పిల్లలప్పుడే కాదు, పెద్దప్పుడూ పెనవేసుకుపోయిన రక్తసంబంధం వారిది! అన్నను తండ్రిగా, గురువుగా, దైవంగా భావించాడు లక్ష్మణుడు. అందుకే యాగ రక్షణకు విశ్వామిత్రుని వెంట రామునితోపాటు లక్ష్మణుడూ వెళ్లాడు. విలువిద్యలు నేర్చుకున్నా- తాటకిని సుబాహుణ్ణి సంహరించి యజ్ఞాన్ని కాపాడినా – అటు పిమ్మట మిథిలకు వెళ్లినా రామునితోనే లక్ష్మణుడు. సీతారాముల పెళ్లప్పుడే ఊర్మిళా లక్ష్మణుల పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినా లక్ష్మణునికి విడిగా జీవితం లేదు. ఊహించలేం. తండ్రి మాటకై రాముడు అడవులకు వెళితే లక్ష్మణుడు తండ్రితో తగువు పడ్డది కాక – అన్న వెంట అడవులకు వెళ్లాడు. తన నిద్రను భార్య ఊర్మిళకు ఇచ్చాడు గనుక రాత్రీ పగలూ నిద్రలేకుండా పద్నాలుగేళ్లు కాపలాకాసి సేవచేసి అన్న వెంటే ఉన్నాడు. వదినను తల్లిలా చూశాడు.
సీత కోరిక మేరకు బంగారు లేడి వెంట పడ్డాడు రాముడు. ‘లక్ష్మణా’ అని ఆపద గొంతుతో రాముని ఆర్తనాధం విన్న సీత లక్ష్మణుని వెళ్లమంది. నిందలేసింది. తప్పని పరిస్థితుల్ల్లో సీతనొదిలి లక్ష్మణుడు వెళుతూ సీత ఉన్న పర్ణశాల చుట్టూ గీత గీశాడు. అదే లక్ష్మణ రేఖ. లక్ష్మణ రేఖ దాటిన సీత రావణుని మాయలో పడింది. అంతకుమించి ఆపదకూ అపహరణకూ లోనయింది.
సీతను కోల్పోయిన రాముడు లక్ష్మణునికే తన బాధనంతా చెప్పుకున్నాడు. సీత జాడను వెతుక్కుంటూ అన్నవెంటే అడుగులేశాడు లక్ష్మణుడు. సీత ఆనవాళ్లుగా దొరికిన ఆభరణాలను లక్ష్మణుడు పోల్చుకోలేకపోయాడు. పాదాల అందెల మట్టీలను మాత్రమే పోల్చాడు. వదిన పాదాలకు నమస్కరించడం వల్లనే లక్ష్మణుడు సులువుగా గుర్తించగలిగాడు. వదిన పాదాల్నే లక్ష్మణుడు చూశాడు! ఇంద్రణ్ణీ ఓడించి – ఇంద్రజిత్తు అనిపించుకున్న మాయా యుద్ధవీరుడైన మేఘనాథుడిని లక్ష్మణుడే ఆటకట్టించి మట్టుబెట్టాడు. అన్న మన్నల్లి అందుకున్నాడు.