పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేబినెట్ ఆమోదం..
ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందినవారు అర్హులు..
దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందినవారికి లబ్ది..
ఈ రుణంలో 75 శాతం వరకు బ్యాంకులకు కేంద్రం గ్యారెంటీ ఇస్తుంది..
విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పీఎం విద్యాలక్ష్మి పథకానికి కూడా ఆమోదం తెలిపారు. పీఎం విద్యాలక్ష్మి పథకం కింద ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన వారు ఆయా సంస్థల్లో చదువుకునేందుకు ‘విద్యాలక్ష్మి పథకం’ ద్వారా రుణాలు పొందవచ్చు. ఈ రుణాలకు కొలేటరల్, గ్యారంటర్ అవసరం లేదని క్యాబినెట్ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
పీఎం విద్యాలక్ష్మీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్రం హామీతో రూ.7.50 లక్షల వరకు రుణం లభించనుంది. ఈ రుణంలో 75 శాతం వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి కూడా ఉన్నత విద్యతకు దూరం కాకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
ఈ పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా ఏటా 22లక్షల మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ఇది సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రక్రియ అని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రూ.8లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. రూ.10లక్షల వరకు రుణాలపై రూ.3శాతం వడ్డీరాయతీ కల్పించనున్నారు. ఏదైనా ప్రభుత్వ స్కాలర్షిప్ పొందుతున్న వాళ్లు ఈ పథకానికి అనర్హులు. విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పూర్తి వివరాలను కూడా తెలుసుకోవచ్చు.