తెలుగుకు సుసంపన్నమైన మౌఖిక, లిఖిత సాహిత్య సంప్రదాయం ఉంది. ‘హితేన సహితం సాహిత్యం’- అంటే మేలును చేకూర్చేది సాహిత్యం అని అర్థం. సాహిత్యం ఒకజాతి సంస్కృతికి అద్భుతమైన లిఖితాధారం. అంతేకాకుండా భాషాపరిణామాన్ని తెలియజెప్పే సాధనం కూడా. మానవుణ్ణి పశుత్వం నుండి పరమేశ్వరత్వం వైపుకి నడిపించే ప్రాథమికసూత్రాలు కలిగినది సాహిత్యం. ఇది మనిషిని మనీషిలా తీర్చిదిద్దుతుంది. ఒకజాతి సాహిత్య సంప్రదాయం సాంస్కృతిక విలువలతోపాటు ఇతర జాతులకంటే భిన్నంగా విలువలతో కూడిన ఒక ప్రత్యేకముద్రని కలిగివుంటుంది. అటువంటి విశేషాలెన్నో మన ప్రాచీన తెలుగుసాహిత్యంలో కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. అంతటి వైభవోపేతమైన మన ప్రాచీనసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన నన్నయ్య, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథుడు, పోతన వంటి ఎంతోమంది కవులు ఈ జాతికి చిరస్మరణీయులు.
తెలుగువాడైన గుణాఢ్యుడు రాసిన బృహత్కథ లభిస్తున్న తెలుగువాళ్ళ తొలి సాహిత్యం. ఇది పైశాచీ ప్రాకృతంలో ఉంది. తెలుగు భాష రెండువేల ఏళ్ళకు ముందే వాడుకలో ఉందనడానికి గాథాసప్తశతి తిరుగులేని ఆధారం. లభిస్తున్న తొలి తెలుగు కావ్య సాహిత్యం నన్నయ రాసిన ఆంధ్ర మహాభారతం రెండున్నర పర్వాలు. నన్నయకు ముందున్న సాహిత్యం ఎంతో ఉంది. కన్నడ భాషలో ఆదికవిగా పేర్కొంటున్న పంపడు తెలుగువాడే. తెలుగు ప్రాంతాల్లోని శాసనాల్లో తెలుగు పదాలు ఉన్నాయ్. లభిస్తున్న శాసనాల్లో మొదటగా పద్యం కన్పిస్తున్న శాసనం అద్ధంకి శాసనం. క్రీ.శ.848 నాటి పండరంగుని అద్దంకి శాసనంలో ఒక తరువోజ పద్యం, తర్వాత కొంత వచనం ఉన్నాయ్. క్రీ.శ.934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనంలో ఐదు సీస పద్యాలున్నాయ్. క్రీ.శ.1000నాటి విరియాల కామసాని గూడూరు శాసనంలో మూడు చంపకమాల, రెండు ఉత్పలమాల పద్యాలున్నాయ్. వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండేదని నిశ్చయంగా తెలుస్తోంది. కాని లిఖిత గ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.మల్లియ రేచన, నన్నయ కంటే ముందే తెలుగు సాహిత్యం సాధారణ వచనాన్ని దాటి కావ్య రూపంలోకి వచ్చిందనడానికి, వివిధ పద్య ఛందస్సులు అప్పటికే తెలుగు ప్రాంతంలో ఉన్నాయనడానికి ఇవన్నీ ప్రబలమైన ఆధారాలు. ప్రాచీన తెలుగు సాహిత్యం ఎక్కువగా ఛందస్సులోనే ఉంది. 10వ శతాబ్దికి చెందిన మల్లియ రేచన రాసిన కవిజనాశ్రయం తెలుగులో లభిస్తున్న తొలి ఛందోగ్రంథం. నన్నయకు ముందున్న అయ్యనభట్టు, చేతనభట్టు, శ్రీపతి పండితుడు, గజాంకుశుడు, వేములవాడ భీమకవిలాంటి కవులు రాసిన సాహిత్యం మనకు దొరకలేదు. నన్నయకు ముందు సాహిత్యం వచ్చిందనడానికి ఇవి ఆధారాలుగా పనికొస్తాయ్. నన్నయ రచన కంటే ముందే ఛందోగ్రంథం, శాసన సాహిత్యం, కవులు ఉండడం వల్ల నన్నయ కాలం కంటే ముందే తెలుగు సాహిత్యం ఉందని బలంగా చెప్పడానిక సాక్ష్యాలుగా ఉపయోగపడుతాయ్. నన్నెచోడుడు, పాల్కురికి సోమనల రచనల్లో అనేక సాహిత్య ప్రక్రియల ప్రస్తావన ఉండడం వల్ల అప్పటి సాహిత్య లిఖిత ఆధారాలు దొరక్కపోయినా, వాటి ఉనికి ఉందనడానికి అవి గట్టి ఆకరాలు. తెలుగులో కావ్యసంప్రదాయం ముందు రోజుల్లోనే చాలా గొప్పగా ఉంది. “కవిత్రయ భారతం మనదేశంలోనే విశిష్టగ్రంథం. ఇది వ్యాస భారతంలో సగం ఉంది. ఇంత పెద్దగ్రంథం ప్రపంచంలోనే అరుదైంది” అన్న ఆర్వీయస్ సుందరం చెప్పిన అభిప్రాయం వల్ల ఆ గ్రంథ ప్రాముఖ్యత తెలుస్తోంది. మన కవిత్రయ భారతం సంస్కృత భారత పరిష్కరణకు ఉపయోగపడిందంటే మన రచనా సంప్రదాయం ఎంతటి విలువైందో అందరికీ అర్థమౌతుంది. అన్నమయ్యలా రోజుకో కీర్తన రాస్తూ ముప్ఫై రెండువేల (32,000) కీర్తనలు రాసిన వాగ్గేయకారుడు ఇతర ప్రపంచ భాషల్లో లేరు. వాటిని రాగిరేకుల్లోకి ఎక్కించారు. ఇంత పెద్ద మొత్తంలో సాహిత్యాన్ని రాగిరేకుల్లో చెక్కిన సంఘటన చాలా అరుదైంది, ఇతర ప్రపంచ భాషల్లో లేనిది. వాటిని రాగిరేకులపై చెక్కడానికి అనుసరించిన పద్ధతులపై ఊహలే తప్పా, ఇప్పటికీ మనం సరైన సమాచారాన్ని గుర్తించలేకపోతున్నాం. ఇక తెలుగులో అష్టావధానం, శతావధానం అనే భాషా ప్రజ్ఞా ప్రదర్శన మన తెలుగు గొప్పతనాన్ని చెప్పుకోడానికిచక్కని ఉదాహరణ. ఇట్లాంటివి ప్రపంచంలో మరి ఏ ఇతర భాషల్లోనూలేవు. మన భాష నుండే ఇతర భాషలకు వ్యాపించాయ్. జానపదసాహిత్యం, ఇతిహాసం, పురాణం, కావ్యం, ఉదాహరణం, ద్విపద, శతకం, ప్రబంధం, కీర్తన, యక్షగానం, సంగీతం, నాటకం, నవల, కథ, వచనకవిత, వ్యాసం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్రలు, యాత్రా కథనాలు, పత్రికా రచన, రేడియో, టీ.వీ మాధ్యమాలకు అనుగుణంగా మలుచుకున్న సాహిత్యప్రక్రియలు… ఇలా ఎన్నో విశేషాలు తెలుగు సాహిత్యంలో చోటు చేసుకున్నాయ్. తెలుగు సాహిత్యానికి సంబంధించిన అనేక తాళపత్ర, రాతప్రతులు ఇంకా అముద్రితంగానే ఉన్నాయ్. వీటితో పాటూ తెలుగేతర ప్రాంతాల్లోనూ ఉన్న తెలుగు సాహిత్యాన్ని సేకరించి, పరిష్కరించి, ముద్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు సాహిత్యాన్ని యుగాలుగా విభజించి అధ్యయనం చేసే విధానం బాగా ప్రసిద్ధిలో ఉంది. పింగళి లక్ష్మీకాంతంగారు మన తెలుగుసాహిత్యాన్ని ఈ కింది విధంగా యుగవిభజన చేశారు.