ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను సోమవారం విడుదల చేసిన విద్యాశాఖ ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటనకు సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన (రేపు) మెగా డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. దరఖాస్తుల ప్రక్రియ కూడా రేపటి నుంచే ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు అంటే.. డిసెంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. ఇందులో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు,, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు ఉండనున్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి.
కాగా, డీఎస్సీని ఆన్లైన్లో నిర్వహిస్తుండటంతో అనేక విడతల్లో పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎస్జీటీ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహణకు వారం రోజుల సమయం పడుతోంది. దీంతో పరీక్షల ఫలితాలను నార్మలైజేషన్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సమస్య లేకుండా ఉండేందుకు రెండు, మూడు జిల్లాలకు ఒకేసారి పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని విద్యా శాఖ యోచిస్తోంది.
ఏపీలో టెట్ ఫలితాలు నిన్ననే విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ కోసం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1,87,256(50.79 శాతం) మంది అర్హత సాధించారు.