దక్షిణాఫ్రికా పర్యటనలో నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లిన యువ భారత్.. బుధవారం ఆతిథ్య జట్టుతో మరో కీలక పోరులో తలపడనుంది. సిరీస్లో ఇరుజట్లు ఇది వరకే తలా ఓ మ్యాచ్ గెలవగా నేడు సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది. డర్బన్లో ఆల్రౌండ్ ఆటతీరుతో అదరగొట్టినా రెండో మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం ‘మెన్ ఇన్ బ్లూ’ను దారుణంగా దెబ్బతీసింది. స్పిన్నర్ల పుణ్యమా అని ఆ మ్యాచ్లో గెలిచే అవకాశాలను సృష్టించుకున్నప్పటికీ ఆఖర్లో పేసర్లు గాడితప్పి మ్యాచ్ను సఫారీలకు అప్పగించారు. కాగా బుధవారం మ్యాచ్లో గెలిచిన జట్టుకు సిరీస్పై పట్టు సాధించే అవకాశం చిక్కనున్న నేపథ్యంలో పోరు ఆసక్తికరంగా సాగనుంది.
టాపార్డర్లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యం భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఆడిన 9 మ్యాచ్లలో జింబాబ్వేతో సెంచరీ మినహా గత 7 ఇన్నింగ్స్ (10, 14, 16, 15, 4, 7, 4)లలో అతడు కనీసం 20 పరుగుల మార్కునూ అందుకోలేదు. ఆది నుంచే ఎదురుదాడికి దిగాలనే వ్యూహంతో అతడు చెత్త షాట్లు ఆడి ఆరంభంలోనే పెవిలియన్కు చేరుతున్నాడు. సెంచూరియన్ మ్యాచ్ అతడికి చావో రేవో అన్నవిధంగా తయారైన నేపథ్యంలో అభిషేక్ ఎలా ఆడతాడనేది చూడాలి. ఒకవేళ అతడిని పక్కనబెడితే రమణ్దీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నట్టు జట్టు మేనేజ్మెంట్ వర్గాల సమాచారం. ఇక డర్బన్లో ఓపెనర్ సంజూ శాంసన్ సెంచరీతో సత్తా చాటినా రెండో మ్యాచ్లో మాత్రం డకౌట్ అయి నిరాశపరిచాడు. బుధవారం నాటి పోరులో అతడి నుంచి అభిమానులు మరో ధనాధన్ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. సారథి సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్లో తన మార్కును చూపించలేకపోయాడు. మిడిలార్డర్లో తిలక్ వర్మ గత రెండు మ్యాచ్లలో ఫర్వాలేదనిపించినా రింకూ సింగ్ తేలిపోతున్నాడు. హార్దిక్ పాండ్యా రెండో టీ20లో టాప్ స్కోరర్గా నిలిచినా అతడు చేసిన పరుగుల కంటే ఆడిన బంతులే ఎక్కువ.
గత రెండు మ్యాచ్లలో భారత్కు పేసర్ల కంటే స్పిన్నర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా మూడేండ్ల తర్వాత జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి అంచనాలకు మించి రాణిస్తున్నాడు. రవి బిష్ణోయ్ సైతం అతడికి అండగా నిలుస్తున్నాడు. కానీ అర్ష్దీప్, అవేశ్ మాత్రం వికెట్ల వేటలో వెనుకబడుతున్నారు. రెండో టీ20లో గెలుపు అంచుల దాకా వచ్చిన భారత్ ఓడటానికి పేసర్లూ ఓ కారణమన్నది తెలిసిందే. సెంచూరియన్లో అయినా పేస్ ద్వయం రాణించాలని భారత్ ఆశిస్తోంది.
ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా సీనియర్లు వరుస మ్యాచ్లలో విఫలమవుతుండటం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. సారథి ఎయిడెన్ మార్క్మ్,్ర డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ వంటి భారీ హిట్టర్లు ఇంతవరకూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కొయెట్జీ పోరాటంతో రెండో టీ20లో ఆ జట్టు గట్టెక్కింది. కొయెట్జీ గత రెండు టీ20లలో బంతితో పాటు బ్యాట్తోనూ సత్తా చాటగా ఆల్రౌండర్ జాన్సెన్ మాత్రం బంతితో ఫర్వాలేదనిపించినా బ్యాట్తో విఫలమవుతున్నాడు. కీలక పోరులో సఫారీ బ్యాటర్లు జూలు విదిల్చితే భారత్కు కష్టాలు తప్పకపోవచ్చు.