భారీ స్థాయిలో వర్షాలు..
158 మందికి పైగా దుర్మరణం
నదులను తలపిస్తున్న ప్రధాన నగరాలు..
వరదలకు కొట్టుకుపోయిన కంటైనర్లు..
యూరప్ దేశం స్పెయిన్ ప్రకృతి ప్రకోపానికి గురైంది. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో భారీ వర్షాలు, వరదలు ఆ దేశ తూర్పు, దక్షిణ ప్రాంతాన్ని ముంచెత్తాయి. గ్రామాలు, పట్టణాలు మొత్తం నీట మునిగాయి. ప్రధాన నగరాలు సైతం నదులను తలపిస్తున్నాయి. కార్లు, పెద్ద పెద్ద కంటైనర్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి.
ఈ వరదల కారణంగా గురువారం వరకూ మరణించిన వారి సంఖ్య 158కి పెరిగింది. కేవలం వాలెన్సియాలోనే 155 మంది మరణించినట్లు గుర్తించారు. వరదల్లో డజన్ల కొద్దీ గల్లంతయ్యారు. ముఖ్యంగా వాలెన్సియా ప్రాంతం ఈ వరదలకు తీవ్ర ప్రభావితమైంది. ఇక్కడ అంచనాలకు మించి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏడాదికి కురవాల్సిన వర్షం ఎనిమిది గంటల్లో కురిసినట్లు పేర్కొన్నారు. భారీ వృక్షాలు, విద్యుత్ లైన్లు, ఇళ్లలోని సామగ్రి కొట్టుకుపోగా.. దుకాణాలు కూడా బుదరలో కూరుకుపోయాయి. రహదారులు సైతం గుర్తుపట్టకుండా మారిపోయాయి. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.