ఇరాన్ గగనతలం మూసివేత..
పలు విమానాలు దారి మళ్లింపు..
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు విమాన ప్రయాణాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో పొరుగున ఉన్న కొన్ని ప్రాంతాలలో కూడా విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగో తమ ప్రయాణికుల కోసం కీలకమైన సూచనలు జారీ చేశాయి. ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడం, దానికి ప్రతిగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు దిగడంతో ఇరు దేశాల మధ్య సంఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఫలితంగా ఇరాన్, ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్ మీదుగా ఉన్న గగనతలాలను మూసివేయాల్సి వచ్చింది. ఇది ఆసియా, యూరప్ మధ్య నడిచే కీలకమైన సుదూర విమాన మార్గాలను ప్రభావితం చేస్తోంది. దీంతో భారత్ నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ముఖ్యంగా అమెరికా, ఉత్తర అమెరికా, యూరప్ వెళ్లే పలు విమానాలను ఎయిర్ ఇండియా దారి మళ్లించింది. ఇక, ఎయిర్ ఇండియా జారీ చేసిన ప్రకటనల ప్రకారం… గగనతల మూసివేత కారణంగా భద్రతాపరమైన ఆందోళనలతో విమానాలను దారి మళ్లించడం లేదా అవి బయలుదేరిన ప్రాంతానికే తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఉదాహరణకు లండన్ హీత్రో నుంచి ముంబయి వస్తున్న విమానాన్ని వియన్నాకు మళ్లించినట్లు సమాచారం.