( రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో వెలుగు చూసిన ఘరానా మోసం.. )
ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల భారీ నష్టం..
రూ. 10 కోట్ల బిడ్ కంపెనీలను పక్కన పెట్టిన వైనం..
కేవలం రూ. 63 లక్షలు బిడ్ వేసిన సంస్థకు అప్పగింత..
ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లనే నవనిర్మాణ సంస్థకు టెండర్ అలాట్..
నవనిర్మాణ సంస్థ యాజమాన్యంపై అనేక ఆరోపణలు కోర్టు వివాదాలు..
ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే టెండర్లను రద్దు చేయాలి..
డిమాండ్ చేస్తున్న సోషల్ జస్టిస్ పార్టీ..
హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పరిధిలో ఎల్.ఈ.డీ. అడ్వర్టైజ్మెంట్ బోర్డుల ఏర్పాటు కొరకు పిలిచిన టెండర్ల లో అవకతవకలు జరిగాయని సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు ఆరోపించారు. గురువారం నాడు హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కె.వి గౌడ్, పార్టీ అధికార ప్రతినిధి కొండల గౌడ్, ఉపాధ్యక్షులు చెన్న శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శి బాలస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు గౌలికార్ సోనీ, న్యాయ విభాగం ఇంచార్జ్ హరి కోయిల్ కార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు చామకూర రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 100 కోట్లు నష్టం వచ్చే విధంగా ప్రైవేట్ సంస్థకు లాభం కల్పించేలా నోటిఫైడ్ ఏరియా కమిటీ అధికారులు వ్యవహరించారని ఆరోపించారు. అనేక ఆరోపణలు, కోర్టు వివాదాల్లో ఉన్న నవనిర్మాణ్ అసోసియేట్స్ సంస్థకు తక్కువ ధరకు టెండర్ అలాట్ చేశారని ఆరోపించారు.. టెండర్ ప్రక్రియలో జతపరచిన డాక్యుమెంట్లలో అనేక అంశాలపై నవనిర్మాణ అసోసియేట్స్ సంస్థ తప్పుదారి పట్టించే డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారని విమర్శించారు. 10, 12 కోట్లు రూపాయలు చెల్లిస్తామన్న సంస్థలను కాదని 63 లక్షలు, 56 లక్షలు కోట్ చేసిన సంస్థలను అర్హత గల సంస్థలుగా ప్రకటించారని ఆరోపించారు. తక్షణమే ఈ ఎల్.ఈ.డీ. అడ్వర్టైజింగ్ ప్రదర్శన నిలిపివేసి, టెండర్ అలాట్మెంట్ పై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలోనే అతి పెద్దదైన హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఆవరణలో అప్రోచ్ రోడ్లపై ప్రదర్శించే అడ్వర్టైజ్మెంట్ ఎల్.ఈ.డి. బోర్డుల ప్రదర్శన అంశాలకు సంబంధించి టెండర్ అలాట్ చేసే ప్రక్రియలో అధికారులు ఉద్దేశపూర్వకంగా అవకతవకలకు పాల్పడ్డారని వారు ధ్వజమెత్తారు
డి.బి.ఎఫ్.ఓ.టి. ( డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ) పద్ధతిగా నోటిఫైడ్ ఏరియా కమిటీ ఎయిర్పోర్ట్ పరిధిని నిర్వహించే స్థానిక పరిపాలన సంస్థ టెండర్లు కాల్ ఫర్ చేసింది. సంవత్సరానికి 10,12 కోట్ల రూపాయలు ఇస్తామన్న సంస్థలను కాదని 63 లక్షలు కోట్ చేసిన సంస్థలను అర్హత గల సంస్థలుగా ప్రకటించి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ సంస్థకు 100 కోట్ల లాభం, ప్రభుత్వానికి 100 కోట్లు నష్టం వచ్చే విధంగా అధికారులు వ్యవహరించారు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పరిధిలోని అప్రోచ్ రోడ్ లో మిడియన్ రోడ్లపై ఎల్ ఈ డి బోర్డుల ప్రదర్శనకు సంబంధించి వివిధ ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల నుంచి ఆసక్తి గల వారిని బి.ఎఫ్.ఓ.టి. ప్రాతిపదికన టెండర్లు ఆహ్వానించారు.
కాగా సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలు తెలియజేసింది.. మొదటగా తేదీ : 3-9-2024 నాడు టెండర్లు ఆహ్వానించారు. టెండర్ ప్రాజెక్ట్ రూపకల్పనలో అర్హతలు, అనర్హతలు విషయంలో, బోర్డు సైజు, హోర్డింగ్ ల సంఖ్య అధికంగా ఉండడం వంటివి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ అడ్వర్టైజింగ్ ఏజెన్సీల సంఘం టోమో (టి ఓ ఎం ఓ ) నోటిఫైడ్ ఏరియా కమిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది.. కోర్టుకు కూడా వెళ్ళింది. దీంతో ఈ టెండర్లను అధికారులు రద్దు చేశారు. ఆ తర్వాత తేదీ 10-10-2024న మళ్ళీ టెండర్లు పిలిచారు. 17వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు.. మొత్తం పది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ సంస్థలు ఈ టెండరర్ లో పాల్గొన్నాయి. అవి 1. బ్రిగేడ్, 2. డైనమిక్స్ డిజిటల్ మీడియా, 3. లక్ష్య మీడియా, 4. మేరా హోల్డింగ్, 5. నవ నిర్మాణ అసోసియేట్స్, 6. ప్రకాష్ ఆర్ట్స్, 7. శ్రీ ఆర్ ఎల్ కన్స్ట్రక్షన్స్, 8. యూని యాడ్స్, 9. వాలప్, 10. సూపర్ లెడ్ వంటి సంస్థలు పాల్గొన్నాయి.
ఈ టెండర్లను 18-10- 2024 నాడు ఉదయం 11 గంటలకు ఓపెన్ చేశారు.. 21- 10- 2024 వరకు ఎవల్యూషన్ పాయింట్స్ చేశారు.. అనంతరం నవనిర్మాణ అసోసియేట్స్, డైనమిక్స్ డిజిటల్ మీడియా లిమిటెడ్ అర్హత సాధించినట్లు ప్రకటించి నవ నిర్మాణ అసోసియేట్స్ కు ఈ టెండర్ ను అలాట్ చేశారు. టెండర్లు దాఖలు చేసిన సంస్థలలో ఈ రెండు సంస్థలు కేవలం నవ నిర్మాణ అసోసియేట్స్ 63 లక్షల రూపాయలు, డైనమిక్స్ సంస్థ 56.5 లక్షల రూపాయలు మాత్రమే కోట్ చేశాయి. సమాచార హక్కు చట్టం ద్వారా
తెలియవచ్చిన సమాచారం మేరకు లక్ష్య మీడియా 10 కోట్ల రూపాయలు, లీడ్ స్పేస్ సంస్థ 12 కోట్ల రూపాయలు కోట్ చేసినట్టు తెలిసింది.
కానీ ఆ సంస్థలను అనర్హులుగా ప్రకటించి, నవ నిర్మాణ సంస్థకు టెండర్ అలాట్ చేయడం జరిగింది. అధికారులు టెండర్ అలాట్ చేసిన నవ నిర్మాణ సంస్థ వివరాలలో లోపాలు ఉన్నాయి. ఈ సంస్థ జతపరిచిన టెండర్ డాక్యుమెంట్ లో పలు అంశాలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. గత అనుభవం విషయంలో, కోర్టు కేసులు ఉన్న విషయంలో ఈ సంస్థ తప్పుదారి పట్టించింది. నార్సింగి మున్సిపాలిటి పరిధిలో ఈ సంస్థపై రిట్ పిటీషన్ 23554/2023, మరో కేసు 19593 అండ్ 30728/2024 గౌరవనీయ హైకోర్టులో విచారణలో ఉన్నాయి. నార్సింగ్ మున్సిపాలిటీలో తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం క్రిమినల్ ఏంక్రోచ్మెంట్ అని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా ఈ సంస్థ దీనిని అనుభవం కింద పేర్కొంటూ.. బిడ్ సబ్మిట్ చేయడం జరిగింది. పైగా బాండ్ పేపర్ పై పెండింగ్, విచారణలో కేసులు లేవని, విజిలెన్స్ విచారణ లేవని, న్యాయవివాదాలు లేవని పేర్కొన్నారు.. బిడ్ కన్సార్టియం విషయంలో కూడా తప్పుదారి పట్టించారు.
సెల్కాన్ కంపెనీ కేవలం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తయారు చేసే కంపెనీ, అవి క్లాస్ రూమ్ లో ఉపయోగపడతాయి. లెడ్ డిస్ ప్లే బోర్డులకు ఉపయోగపడవు. అంతే కాకుండా ఫైనాన్షియల్ బిడ్ విషయంలో అధికారిక లెటర్ హెడ్ మీద పేర్కొనలేదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈ సంస్థకు అర్హత ఉండదు. కానీ అధికారులు అర్హత కల్పించారు.. పైగా ఈ ప్రాజెక్టులో పేర్కొనని కొన్ని బోర్డులు ఇప్పటికే మొదలుపెట్టారు. గ్రాండ్ ఆర్చ్ ప్రాజెక్టులో లేదు, అయినా నిర్మిస్తున్నారు. అంతే కాకుండా గార్డెన్ బ్యూటిఫికేషన్ పనుల తర్వాత డిస్ ప్లే స్టార్ట్ చేయాలి.. గార్డెన్ బ్యూటిఫికేషన్ లు ఇతర పనులను పెండింగ్ పెట్టి ఇప్పటికే డిస్ ప్లే లు ప్రదర్శిస్తున్నారు. వీడియో ప్రకటనలు ట్రాఫిక్ రద్దీగా ఉండే రోడ్లపై ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత పార్టనర్లుగా ఉన్న రాజ్ కుమార్, సాయిలు గతంలో ‘ఆడ్ వే’ అనే సంస్థను నడిపారు.. ఈ సంస్థకు గతంలో 100 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసిలో విశ్వజిత్ అధికారిగా ఉన్నప్పుడు ఫైన్ వేశారు. కూకట్ పల్లి స్పోర్ట్స్ స్టేడియం మెయింటెనెన్స్ విషయంలో కూడా 50 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసికి కట్టలేదని తెలిసింది.
సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కె వి గౌడ్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కేవలం రెండు అడ్వర్టైజ్మెంట్ సంస్థలను పెంచి పోషించి, వందలాది అడ్వర్టైజింగ్ ఏజెన్సీలను ముంచి వేలాది కుటుంబాల ఉపాధిని మింగేశారని, కాంగ్రెస్ పార్టీ వస్తే తమ బతుకుల్లో మార్పు వస్తదేమో అని భావించారు. కానీ మూలిగే నక్కపై తాటపండు పడ్డట్టు 2024 మార్చి 18న మున్సిపల్ అడ్వర్టైజ్మెంట్ టాక్స్ వసూలు చేయొద్దని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. తర్వాత పన్నులు కట్టలేదని కొన్ని ప్రాంతాల్లో చిన్న ఏజెన్సీల బోర్డులను హైడ్రా కూల్చివేశారు. గత ప్రభుత్వంలో లీడ్ స్పేస్, ప్రకాష్ ఆర్ట్స్ గుత్తాధిపత్యం వహించి మిగతా ఏజెన్సీలను మింగేయగా, ప్రస్తుతం టార్గెట్, నవనిర్మాణ అసోసియేట్ సంస్థలు ఆ ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. నార్సింగ్ 15, తెల్లాపూర్ 12, మణికొండలో 8, బండ్లగూడలో ఇలా 10 మున్సిపాలిటీలలో ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్న చిన్న యాడ్ ఏజెన్సీలను బెదిరించి ఈ కార్పొరేట్ ఏజెన్సీలు హోర్డింగులను గుంజుకున్నవి.
కాగా సోషల్ జస్టిస్ పార్టీ వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా డిమాండ్ చేస్తున్నారు.. నోటిఫైడ్ ఏరియా కమిటీ అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ టెండర్ అలాట్మెంట్ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని, అప్పటి వరకు అడ్వర్టైజ్మెంట్ ప్రదర్శన ఆపాలని, నవ నిర్మాణ అసోసియేట్స్ ఏజెన్సీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు..
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి కేవీ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నా శ్రీకాంత్, జాతీయ అధికార ప్రతినిధి వేముల కొండల్, సంయుక్త కార్యదర్శి బాలస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు గౌలికార్ సోనీ, న్యాయ విభాగం ఇంచార్జ్ హరి కోయిల్ కార్ పాల్గొన్నారు.