నెలకు రూ.2500 స్టైఫండ్ అందజేత..
ఆంధ్రప్రదేశ్లో త్వరలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో మెగా డీఎస్సీకి సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శుభవార్త చెప్పారు. బీసీ స్డడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రెండు నెలల పాటు ఇవ్వనున్న ఈ ఉచిత డీఎస్సీ కోచింగ్ సమయంలో నిరుద్యోగులకు నెలకు రూ.1,500 స్టైపెండ్, మెటీరియల్ కోసం మరో రూ.1000 అందజేస్తామని తెలిపారు. నవంబర్ 16వ తేదీ నుంచి నుంచి బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో కోచింగ్ సెంటర్లో 200 మంది అభ్యర్థుల చొప్పున మొత్తం 5,200 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ బీసీ స్టడీ సర్కిళ్లలో బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున సీట్లు కేటాయించామని అన్నారు. వారితో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామన్నారు..