Friday, June 20, 2025
Google search engine
Homeస్పోర్ట్స్ఐపీఎల్ తరహాలో తెలుగు నేలపై టి 20..

ఐపీఎల్ తరహాలో తెలుగు నేలపై టి 20..

మహిళల ప్రీమియర్ లీగ్స్ కు బీజం..
తాజా నిర్ణయం తీసుకున్న ఆంధ్ర క్రికెట్ సంఘం..

పొట్టి క్రికెట్ స్వ‌రూపాన్ని మార్చేసిన ఐపీఎల్ ప‌లు దేశాల్లో టీ20 లీగ్స్‌కు బీజం వేసింది. ఐపీఎల్ సూప‌ర్ హిట్ కావ‌డంతో మ‌న‌దేశంలో మ‌హిళా క్రికెట్ పురోగ‌తిని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌ కు రూప‌మిచ్చింది. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర క్రికెట్ సంఘం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళా క్రికెట్ అభ్యున్న‌తి కోసం గ‌తంలో నిర్వ‌హించిన‌ ఐపీఎల్ త‌ర‌హా లీగ్‌ను పున‌రుద్ధ‌రించాల‌ని సంక‌ల్పించింది. ఆదివారం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన వార్షిక‌ స‌మావేశంలో ఏసీఏ ప్ర‌తినిధులు ఈ తీర్మానానికి వ‌చ్చారు.

ఇప్ప‌టికే ఆరు పురుషుల జ‌ట్ల‌తో ఆంధ్ర ప్రీమియ‌ర్ లీగ్‌ను నిర్వ‌హిస్తోంది ఏసీఏ. ఈ లీగ్ విజ‌య‌వంతం కావ‌డంతో మ‌హిళా క్రికెటర్ల నైపుణ్యాలు మెరుగ‌పర‌చ‌డంతో పాటు వాళ్ల‌కు జాతీయ జ‌ట్టుకు ఎంపిక‌య్యేలా చేయాల‌ని ఏసీఏ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇంత‌కుముందు మ‌హిళా క్రికెట‌ర్ల‌తో ఆంధ్రా ఉమెన్స్ టీ20 లీగ్‌ను నిర్వ‌హించిన అనుభ‌వమూ అసోసియేష‌న్‌కు ఉంది. మూడు జ‌ట్లు త‌ల‌ప‌డే ఈ టోర్నీ నిరుడు అర్ధాంత‌రంగా వాయిదా ప‌డింది. అయితే.. ఈ ఏడాది మ‌రొక జ‌ట్టును చేర్చి.. మొత్తంగా 4 టీమ్స్‌తో లీగ్‌ను జ‌ర‌పాల‌నే ఉద్దేశంతో ఉన్నారు క్రికెట్ సంఘం పెద్ద‌లు. ‘మ‌హిళా క్రికెట‌ర్ల కోసం ఐపీఎల్ త‌ర‌హాలో టీ20 లీగ్ జ‌ర‌పాల‌నే నిర్ణ‌యం రాష్ట్రంలో మ‌హిళ‌ల క్రికెట్ అభ్యున్న‌తి ఏసీఏ కృషికి నిద‌ర్శ‌నం కానుంది. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివ‌నాథ్, కార్య‌ద‌ర్శి ఎస్ స‌తీశ్ మ‌హిళా క్రికెట్ పురోగ‌తికి క‌ట్టుబ‌డి ఉన్నారు’ అని సోమ‌వారం ఆంధ్రా క్రికెట్ సంఘం అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. ఆగ‌స్టులో మ‌హిళ‌ల టీ20 లీగ్ నిర్వ‌హ‌ణ‌కు స‌న్నాహ‌కాలు చేస్తున్నామ‌ని ఏసీఏ వ‌ర్గాలు తెలిపాయి.

కానీ, ఏక‌కాలంలో అటు పురుషుల‌, ఇటు మ‌హిళ‌ల లీగ్ నిర్వ‌హ‌ణ స‌వాల్‌గా మార‌నుంది. ఎందుకంటే.. స్టేడియం, ఆట‌గాళ్ల కిట్, ఇత‌ర‌ సామ‌గ్రి.. వంటివాటిని త‌ర‌లించడం ఖ‌ర్చు, స‌మ‌యంతో కూడిన ప‌ని. అయినా స‌రే ఆగస్టులో రెండు లీగ్స్‌ను జ‌రిపేందుకు ఏసీఏ సిద్ద‌మ‌వుతోంది. ప్ర‌స్తుతానికి నిర్వ‌హ‌ణ వ్యయం అంతా అసోసియేష‌న్ చూసుకోనుంది. త్వ‌రలోనే దీన్ని ఫ్రాంచైజీ లీగ్‌గా మార్చాల‌నే ఆలోచ‌న‌తో ఉంది ఏసీఏ. టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్ర‌స్తుతం ఏపీ మ‌హిళా క్రికెట్‌కు క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆమె స‌ల‌హాలు సూచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడుతూ మ‌హిళా క్రికెట్ కార్య‌క్ర‌మాల‌ను చూసుకునేందుకు త్వ‌ర‌లోనే ఒక క‌మిటీని ఏర్పాటు చేయ‌నుంది ఏసీఏ. అంతేకాదు పూర్తిగా మ‌హిళా స‌భ్యులతో కూడిన సెలెక్ష‌న్ క‌మిటీకి కూడా రూప‌మివ్వ‌నుందనే వార్త‌లు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments