Sunday, June 22, 2025
Google search engine
Homeతెలంగాణకలం కార్మికులకు కన్నీరు పెట్టించిన ఘనత కేసీఆర్ దే..

కలం కార్మికులకు కన్నీరు పెట్టించిన ఘనత కేసీఆర్ దే..

అదే బాటలో పయనిస్తున్న రేవంత్ సర్కార్..
పాలకుల నిర్లక్ష్యంపై పోరాటం తప్పదు..
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జర్నలిస్టులకు కన్నీరు పెట్టించిన ఘనత గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేళ్ల పాలనలో జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా సూర్య దినపత్రిక బ్యూరో శివకుమార్ నేతృత్వంలో వివిధ పత్రికలకు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు ఫెడరేషన్ లో చేరారు. వీరందరికి రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ సభ్యత్వం ఇచ్చి సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం బాటలోనే నడుస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వలేక పోయిందని, ఇళ్ళ స్థలాల విషయంలో చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల సమస్యల పట్ల గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తే పాత్రికేయుల పోరాటం తప్పదని అన్నారు.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ జర్నలిస్టు యూనియన్ గా ఏర్పడిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జర్నలిస్టుల ఆదరణతో నెంబర్ వన్ యూనియన్ గా బలపడిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జర్నలిస్టుల నుంచి విశేష స్పందన లభిస్తుందని, త్వరలో అన్ని జిల్లాల్లో మహాసభలు పూర్తి చేసి రాష్ట్ర మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు.

రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయని, ఒకవైపు యాజమాన్యాలు, ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం, మరోవైపు దాడులు, అవమానాలు పెరిగిపోతున్నాయని మామిడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు శిక్షణతో కూడిన వృత్తినైపుణ్యతను పెంపొందించుకొని విధినిర్వహణలో సమర్ధవంతంగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలోని కొన్ని జర్నలిస్టు సంఘాలు ప్రజల, పాత్రికేయుల పక్షం కాకుండా పాలకుల పక్షాన నిలిచి జర్నలిస్టుల సమస్యలను విస్మరించాయని విమర్శించారు. టీడబ్ల్యూజేఎఫ్ సంఘం పాలకుల పక్షాన కాకుండా కేవలం పాత్రికేయుల పక్షాన నిలిచి సమస్యలపై పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సంఘంలో ఉన్న పాత్రికేయులు కూడా ప్రజల పక్షం ఉండాలని, ప్రజల సమస్యలపై స్పందించాలని కోరారు.

ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు జర్నలిస్టులను పూర్తిగా విస్మరించాయని, గత బీఆర్ ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు రాకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు వంటి సమస్యలు పరిష్కరించాల్సివుందని, హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో ఫెడరేషన్ జరుపబోయే ఉద్యమాల్లో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా వ్యవస్థాపక సభ్యుడు యాదగిరి, జిల్లా కార్యదర్శి ఎం.గోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండేటి నరసింహ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పసుపుల శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ మొయిజ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రఫీక్, జిల్లా కార్యనిర్వహక కమిటి సబ్యులు సుకుమార్ ,రామకృష్ణ, నరసింహ ఆరగిద్ద అనీల్ కుమార్ దాస్, దిలీప్, మల్లికార్జున్ గౌడ్, కృష్ణ యాదవ్, విజయ్ కుమార్, కె. కృష్ణ, కె. ఓం ప్రకాష్, జగదీష్, ఇలియాస్, ఎస్ ఆనంద్ బాబు, కామరాజు, కుమార్, డీ. నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments