- క్యూర్ ప్రాంతంలోని 18,766 ఆటోలకు ఊరట.. రెట్రోఫిట్మెంట్ లేదా కొత్త ఈవీ కొనుగోలుకు రూ.1.50 లక్షల ఆర్థిక భరోసా!
- సుస్థిర ప్రజా రవాణా లక్ష్యంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ కేటాయింపు.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ప్రకటన!
హైదరాబాద్:
హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరిగిపోతున్న వాయు, శబ్ద కాలుష్య కారకాలను కట్టడి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్–2047 ప్రణాళికకు అనుగుణంగా “తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026” అమలుకు రాష్ట్ర కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసిందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో చివరి మైలు ప్రయాణ సేవలను అందిస్తున్న సాంప్రదాయ ఇంధన ఆటోలను దశలవారీగా నెట్-జీరో కార్బన్ ఉద్గారాల వ్యవస్థలోకి మార్చడమే ఈ మహత్తర కార్యక్రమ ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు.

*18,766 ఆటోల ఎలక్ట్రిక్ మార్పిడి లక్ష్యం
రవాణా శాఖ అధికారిక దత్తాంశాల ప్రకారం, CURE పరిధిలో నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్ అయి క్రియాశీలకంగా సేవనందిస్తున్న మొత్తం 18,766 ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఆటోలు ఈ పథకానికి అర్హత కలిగివున్నాయి.
- డీజిల్ ఆటోలు: 11,254
- పెట్రోల్ ఆటోలు: 7,512
- మొత్తం అర్హత గల వాహనాలు: 18,766
ఈ వాహనాల ద్వారా కలుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు, ఇంధన కొనుగోళ్ల భారంతో సతమతమవుతున్న డ్రైవర్ల ఆర్థిక వెతలను తొలగించేందుకు ప్రభుత్వం రెండు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
*రెండు వినూత్న మార్గాలు – ఆర్థిక వెసులుబాటు
- అంశం–A (ఎలక్ట్రిక్ రెట్రోఫిట్మెంట్): లబ్ధిదారులు తమ ప్రస్తుత ఆటో ఛాసిస్ను అలాగే ఉంచుకుని, AIS–123 ప్రమాణాలు కలిగిన ఎలక్ట్రిక్ కిట్ను అమర్చుకోవచ్చు. కిట్ కొనుగోలు, ఇన్స్టాలేషన్ మరియు ప్రామాణిక పరికరాల వ్యయం కింద గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు లేదా వాస్తవ ఖర్చు – ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ప్రభుత్వం రాయితీ రూపంలో అందిస్తుంది.
- అంశం–B (కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు): పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించి, ఫ్యాక్టరీ తయారీ టైప్ అప్రూవ్డ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ వీలర్ (L5M) కొనుగోలు చేసే వారికి రూ.1.50 లక్షల స్థిర సబ్సిడీ నేరుగా వర్తింపజేయబడుతుంది.
*రూ.200 కోట్ల భారీ కేటాయింపు – మూడంచెల పర్యవేక్షణ:
ఈ పథక అమలు నిమిత్తం ప్రభుత్వం రూ.200 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా సమానంగా రూ.50 కోట్ల చొప్పున నిధులను సమీకరించి అర్హులైన అన్ని వర్గాల వారికి ఎలాంటి వివక్ష లేకుండా ఈ ఫలాలను అందించనున్నారు.
పథకం అమలులో పారదర్శకతను కాపాడేందుకు రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ (SLSC), పథకం అమలు కమిటీ (SIC) మరియు జిల్లా మంజూరు కమిటీ (DSC) ఆధ్వర్యంలో మూడంచెల కఠిన పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.



