జూలై 14 నుంచే తరగతులు..
తాత్కాలిక క్యాంపస్లోనే క్లాసులు..
రాష్ర్టానికి మంజూరైన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. రెండో విడతలో 6వ తరగతిలో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్నారు. జూలై 14 నుంచే తాత్కాలిక క్యాంపస్లోనే తరగతులు నడుస్తాయి. జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మలాజిగిరి, మహబూబ్నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరానికి నవోదయాల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇటీవల విడుదలైన అడ్మిషన్ నోటిఫికేషన్లో మాత్రం ఈ విద్యాలయాల పేర్లను చేర్చలేదు.
ఇప్పటికే ఉన్న 9 నవోదయాల్లోనే అడ్మిషన్లు ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇదే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 3న ‘నవోదయ.. ఈ సారి అడ్మిషన్ లేదయా’ శీర్షికతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో నవోదయ విద్యాలయాలపై విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా సోమవారం సచివాలయంలో అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్తగా మంజూరైన నవోదయ విద్యాలయాలను ప్రారంభించే చర్చించారు. మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, విద్యాప్రణాళిక, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవడం వంటి అంశాలపై దృష్టిసారించారు.