ఆందోళన వ్యక్తం చేసిన హరీశ్ రావు..
సీఎం రేవంత్ రెడ్డి అపరిపక్వ వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. అశాంతి, అలజడితో రాష్ట్రం అట్టుడుకుతున్నదని ధ్వజమెత్తారు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరుతో బీఆర్ఎస్ ఛార్జిషీట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మంలో వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే రాళ్ల దాడి చేశారని తెలిపారు.
కాంగ్రెస్ వచ్చిన ఏడాది కాలంలో రోడ్డెక్కని రంగమే లేదు. బడి పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ నడిరోడ్డు మీదికి ఈడ్చారని చెప్పారు. ఆరు గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారని, అమలు చేయకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేశారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నారు మండిపడ్డారు. అశాంతి, అలజడితో రాష్ట్రం అట్టుడుకున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 9 చోట్ల మత కలహాలు జరిగాయని విమర్శించారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు ప్రారంభించి అరాచకం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం విక్రయాలు పెంచాలని మెమోలు ఇచ్చారని చెప్పారు. గాంధీభవన్లో వచ్చే సూచనల ఆధారంగా చట్టాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆఖరికి దేవుళ్లను కూడా మోసం చేశాడని, అందుకే భూకంపం వచ్చిందని తనతో కొందరు అనట్లు చెప్పారు.