- సమాఖ్య స్ఫూర్తికి నిలువెత్తు రూపం..
- జల వివాదాలు తేలేవరకు విశ్రమించం.. పెండింగ్ సమస్యలపై రాజీలేని పోరు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరిక
మహాబలిపురం:
భారతీయ సమాఖ్య వ్యవస్థలో అసలైన శక్తి విభిన్న ప్రాంతాల సమన్వయం నుంచే ఉద్భవిస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తేల్చిచెప్పేశారు. మహాబలిపుర వేదికగా జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో ఆయన రాష్ట్ర వాదనను అత్యంత పదునైన శైలిలో వినిపించారు. బలమైన నిర్మాణానికి ప్రతి భాగం తన వంతు భారాన్ని మోయాల్సిందేనని, అదే రీతిలో దక్షిణ భారతదేశం పురోగమిస్తేనే దేశం విశ్వవేదికపై అగ్రగామిగా నిలవగలదని ఆయన పునరుద్ఘాటించారు.
*సహకార సమాఖ్యకు సరిహద్దుల అడ్డంకులు లేవు
రాష్ట్రాల మధ్య పెట్టుబడులు, పరిశ్రమల కోసం పోటీ సహజమే అయినప్పటికీ, నదులు, విద్యుత్ గ్రిడ్లు, కార్మిక శక్తికి సరిహద్దుల నియంత్రణ వర్తించదని భట్టి స్పష్టం చేశారు. సమస్యలు ప్రభుత్వ ఫైళ్ల కంటే వేగంగా సరిహద్దులు దాటుతున్న నేపథ్యంలో.. దక్షిణ ప్రాంతీయ మండలి లాంటి సంస్థల పాత్ర మరింత కీలకంగా మారిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయాలని, పారదర్శకమైన విధానాలతోనే పరస్పర విశ్వాసం పెరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.
*కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసమే పోరాటం
కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రాల హక్కులను కాలరాసే ఏకపక్ష చర్యలను సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II పరిధిలో ఉన్న అంశాలపై సత్వర చట్టబద్ధ పరిష్కారం రావలసిన అవసరం ఉందని గుర్తుచేశారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు కూడా వేగవంతం చేశామని తెలిపారు.
*పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులో తాత్సారం తగదు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 అమల్లోకి వచ్చి పన్నేండేళ్లు గడుస్తున్నా ఇంకా పెండింగ్ సమస్యలు కొనసాగడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలు, అంతులేని చర్చలతో కాలయాపన చేయడం సరికాదని తేల్చిచెప్పారు. షెడ్యూల్-IX కింద ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల విభజనకు సంబంధించి తెలంగాణ తన స్పష్టమైన వైఖరిని కేంద్ర హోంశాఖకు ఇప్పటికే సమర్పించిందని గుర్తుచేశారు. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే ప్రతి అంశానికి తార్కిక ముగింపు పలకాలని డిమాండ్ చేశారు.
:హైదరాబాద్ వేదికగా తదుపరి సమర శంఖం
దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొన్న అన్ని రకాల వివాదాలకు తదుపరి సమావేశంలో శాశ్వత తెరదించాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తదుపరి 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాన్ని చారిత్రక నగరమైన హైదరాబాద్లో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి వచ్చే అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు తెలంగాణ సాంప్రదాయ ఆతిథ్యం అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.


