సోమవారం హైడ్రా ప్రజావాణికి అందిన 23 ఫిర్యాదులు..
70 శాతం నాలాల సమస్యలపై ఫిర్యాదులు..
నాలాల కబ్జాలపై ఫిర్యాదులు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్నా కూడా సోమవారం హైడ్రా ప్రజావాణికి 23 ఫిర్యాదులందాయి. ఇందులో 70 శాతం నాలాల సమస్యలపైన ఫిర్యాదులందాయి. మిగతావి ఎప్పటిలాగే రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపైన ఉన్నాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి, భూదేవినగర్లోని సాయిదత్తా గార్డెన్స్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఉద్దేశించిన 225 గజాల స్థలం కబ్జా అయ్యిందని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 2004లోనే జీహెచ్ ఎంసీకి ఆ స్థలాన్ని ఇచ్చి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరినా.. ఫలితం లేకపోయిందని వాపోయారు. శేరిలింగంపల్లి మండలంలోని ఖానామెట్ విలేజ్లో 11/20, 11/21 సర్వే నంబర్లలో 1983లో గురుకుల ట్రస్టు లే ఔట్ వేశారు. అందులోని ప్లాట్లతో పాటు.. రహదారులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఫిర్యాదుచేశారు. వర్షాకాలం కావడంతో నాలాల కబ్జాల ఫిర్యాదులపై ఎక్కువ దృష్టి పెట్టినా.. ఎప్పటిలాగే కొన్ని జనరల్ ఫిర్యాదులను కూడా తీసుకుంటోంది.
బేగంపేటలోని చికోటి గార్డెన్స్ ప్రాంతంలో నాలా కుంచించుకుపోవడంతో బృందావన్ అపార్టుమెంట్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. 2020 సంవత్సరంలో వరదలకు సెల్లార్ నీట మునిగింది ఇలా వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఇక్కడి నాలా పొంగి నివాస ప్రాంతాల్లోకి వరద నీరుచేరకుండా చూడాలని అపార్టుమెంటు నివాసితులు ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి లోని రంగధాముని చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలతో పాటు.. ఈ చెరువునుంచి ఐడీఎల్ చెరువుకు వెళ్లే నాలా కూడా కబ్జా జరిగిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో భారీ వర్షాలు కురిసినప్పడు 7 కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంటోందని వాపోయారు. వెంటనే ఆక్రమణలను తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. హస్మత్పేట నాలా, పికెట్ నాలాలు కుంచించుకుపోవడంతో బేగంపేట పరిసరాల్లో పాయిగా కాలనీ, విమాన్ నగర్, బీహెచ్ ఈఎల్ కాలనీ, అవంతి కాలనీ, రసూల్పురా బస్తీ వరద నీటిలో చిక్కుకుంటున్నాయని స్థానికులు ఫిర్యాదుచేశారు. సైదాబాద్, బాలాజీనగర్లో మురుగు, వరద కాలువలు కబ్జాకు గురయ్యాయని బాలాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఓవైసీ ఆసుపత్రి వద్ద చెరువు నిండితే .. ఆ వరద ఆదర్శ్నగర్ మీదుగా సరూర్నగర్ చెరువుకు చేరాల్సి ఉండగా.. వరద కాలువ కుంచించుకుపోవడంతో బస్తీలు నీట మునుగుతున్నాయని పేర్కొన్నారు.