ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం
ఎల్బీనగర్
కాలనీలలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఎల్బీనగర్ జోన్ సరూర్ నగర్ సర్కిల్ 12 లో జరిగిన కార్యక్రమంలో కమీషనర్ పాల్గొన్నారు. ఆర్కేపురం డివిజన్ టెలిఫోన్ కాలనీ, ఎన్టిఆర్ నగర్ డివిజన్ చిత్ర లేఅవుట్ లో పర్యటించారు. టెలిఫోన్ కాలనీ ఆర్చి నుండి ప్రత్యంగిరా వారాహి ఆలయం వరకు కాలినడకన పర్యటించారు. రోడ్డువెంట ఉన్న చెత్తను పరిశీలించి శుభ్రం చేయాలని ఆదేశించారు. నివాసాలు, అపార్ట్ మెంట్ లలో నివసించే యజమానులు తమ నివాసాల ముందు ఏర్పాటు చేసుకున్న గ్రీనరి గ్రిల్స్ వద్ద చెత్త లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈవిషయం యజమానులకు వివరించాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార దుకాణాల ముందు పడేసిన చెత్తను దుకాణ యజమానులే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం చిత్రా లేఅవుట్ లో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కాలనీలో ఉన్న ఈ వేస్ట్ ను తమ అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించి సహకరించాలని కాలనీవాసులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను పగడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, శానిటేషన్ డిఈఈ చందన,రాంకీ సెక్టార్ హెడ్ వేణు కుమార్, ఎల్బీనగర్ జోన్ ఇంచార్జి భరత్ ఎస్ఎస్ గద్దల బుచ్చయ్య, ఎస్ఎఫ్ఏ లు, రాంకీ సిబ్బంది దిలీప్ రెడ్డి కాలనీవాసులు పాల్గొన్నారు.


