అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ను ఏర్పాటు చేసింది..
పట్టణ చెరువుల నిర్వహణ అంశంపై జరిగిన సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్..
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ – నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పట్టణ చెరువుల నిర్వహణ అంశంపై మంగళవారం బేగంపేటలోని పర్యాటక భవన్లో నిర్వహించిన సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొని ప్రసంగించారు.. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
పట్టణీకరణ వేగంగా జరుగుతున్న క్రమంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా వుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో నగరీకరణ వేగంగా జరుగుతోంది. దేశంలో పట్టణీకరణ కంటే 12 శాతం తెలంగాణలో ఎక్కువ వుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 47 శాతం పట్టణీకరణ 2050 నాటికి 75 శాతానికి చేరుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. యిలాంటి తరుణంలో ప్రకృతి వనరులను కాపడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అన్నారు.. అప్పుడే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని, మెరుగైన జీవనాన్ని అందించగలం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం యీ ఏడాది జూలైలో హైడ్రాను ఏర్పాటు చేసింది. జీహెచ్ ఎంసీలో భాగంగా ఉన్న ఈవీడీఎం ( ఎన్ఫోర్సుమెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్) వింగ్ను హైడ్రాలో విలీనం చేసింది. ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం, ప్రభుత్వ ఆస్తులు కాపాడడం, చెరువుల పరిరక్షణ, ప్రజావసరాల కేటాయించిన పార్కులను, రహదారులు కబ్జాలకు గురికాకుండా కాపాడడం హైడ్రా ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలిపారు.. పట్టణీకరణలో భాగంగా నగరంలో యిళ్ళ స్థలాలకు డిమాండ్ ఏర్పడింది. భూమికి విలువ పెరిగి కొన్ని చోట్ల చెరువులు కబ్జాకు గురి అయ్యాయి. ఇలా నగరంలో 61 శాతం చెరువులు ఇప్పటికే కనుమరుగయ్యాయి అని లెక్కలు చెబుతున్నాయి. ఇంకా మిగిలిన 39 శాతం చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా వుంది. లేని పక్షంలో మరో 15 ఏళ్లకు నగరంలో చెరువులు కనిపించని పరిస్థితి ఏర్పడుతుంది.

నగరంలో చెరువులు ఎన్ని వున్నాయి, చెరువుల విస్తీర్ణం ఎంత అనే దానితో పాటు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించే పనిని హైడ్రా చేపట్టింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ సర్వే విభాగం, విలేజ్ మ్యాప్స్ ఆధారంగా చెరువుల విస్తీర్ణాన్ని నిర్ధారించి.. ఉన్నవాటిని కాపాడాలనే ప్రభుత్వ లక్ష్యాల మేరకు హైడ్రా పని చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇంజనీరింగ్, మైనర్ ఇరిగేషన్, పర్యావరణ వేత్తలు, చెరువుల పరిరక్షణకు పని చేస్తున్న నిపుణులతో సదస్సు నిర్వహించాం. ఆ సదస్సులో నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని చెరువులను కాపాడేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోందని తెలిపారు..
చెరువులు, పార్కులను కాపాడుకున్నప్పుడే పర్యావరణ సమతుల్యత సాధ్యం అవుతుంది. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ దెబ్బ తినడం వల్లే నగరంలో 2 సెంటీ మీటర్ల వర్షం పడినా రహదారులు నీట మునుగుతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడుతున్నాయి.

ఇలాంటి తరుణంలో గొలుసుకట్టు చెరువులను కాపాడుకోవాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే అనుమతులు లేని అక్రమ కట్టడాలను కొన్నిటిని హైడ్రా కూల్చింది. కూల్చడం కాదు చెరువులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణ హైడ్రా లక్ష్యం. హైడ్రా చర్యలవల్ల సామన్యులలో కూడా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్ టీఎల్), చెరువు పూర్తి సామర్ధ్య విస్తీర్ణం(బఫర్), చెరువు క్యాచ్మెంట్ ఏరియా అనే అంశాల పట్ల అవగాహన వచ్చింది. ఇళ్ళు కొనేటప్పుడు ఎఫ్ టీ ఎల్, బఫర్, ప్రభుత్వ భూమి యిలా వివరాలన్నీ తెలుసుకొని నగర ప్రజలు కొంటున్నారు. ప్రజలు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు మోసపోని పరిస్థితులలో స్థిరాస్తి వ్యాపారం కూడా స్థిరంగా సాగుతుంది. ఇలాంటి తరుణంలో అర్బన్ లేక్ మేనేజ్మెంట్ పై “లేక్స్ – 2024” పేరిట సి.ఎస్.ఐ.ఆర్. – ఎన్.ఈ.ఈ.ఆర్.ఐ. నిర్వహించిన మేధోమథనం ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు..

ఈ సదస్సులో పాల్గొనడం ఎంతో ఆనందంగా వుంది. యీ సదస్సు ద్వారా ప్రజల్లో మరింత అవగాహన కలుగుతుంది. చెరువుల పరిరక్షణ, జల, వాయు కాలుష్యము లేని చెరువులు వుండాలనే లక్ష్యంతో పని చేస్తున్న హైడ్రా కు ఈ సదస్సులో నిపుణుల సూచనలు, సలహాలు మరింత మార్గదర్శకంగా నిలుస్తాయి. నాగపూర్ సీఎస్ఐఆర్ – నీరి డైరెక్టర్ డా. ఏ. ఎన్. వైద్య, సి.ఎస్.ఐ.ఆర్. – ఎన్.ఈ.ఈ. ఆర్.ఐ. హైదరాబాద్ జోనల్ సెంటర్ చీఫ్ సైంటిస్ట్ డా. షేక్ భాషా తో పాటు సదస్సుకు హాజరైన శాస్త్రవేత్తలకు, వివిధ రంగాలకు చెందిన నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు రంగనాథ్..