డిస్మిస్ అయిన ప్రియుడు..
అరెస్ట్ చేసిన పోలీసులు..
డిస్మిస్ అయిన పోలీస్ తన ప్రియురాలిని హత్య చేశాడు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద మహిళ మృతదేహాన్ని పాతిపెట్టాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల నరేష్ అలియాస్ నరేంద్ర పాండురంగ్ దహులే గతంలో పోలీస్గా పని చేసి డిస్మిస్ అయ్యాడు. క్లాస్మేట్ అయిన చంద్రపూర్ జిల్లాలోని చిమూర్కు చెందిన 40 ఏళ్ల మహిళ ఆగస్ట్లో ఫేస్బుక్ ద్వారా అతడికి తిరిగి పరిచయమైంది. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా, నరేష్, ఆ మహిళ కలిసి తమ ఇళ్ల నుంచి పారిపోవాలని ప్లాన్ చేశారు. అయితే నవంబర్ 26న ఆ తర్వాత జీవితం, భవిష్యత్తుపై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఆగ్రహం చెందిన నరేష్ గొంతునొక్కి ప్రియురాలిని హత్య చేశాడు. దొంగిలించిన కారులో నాగపూర్ శివారుకు చేరుకున్నాడు. వేలా హరి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్ వద్ద మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.
మరోవైపు కారు చోరీపై ఫిర్యాదు అందుకున్న చంద్రాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారును దొంగిలించిన నరేష్ అలియాస్ నరేంద్ర పాండురంగ్ దహులేను అరెస్ట్ చేశారు. డిస్మిస్ అయిన ఆ పోలీస్ ఫోన్ రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలించారు. దీంతో ప్రియురాలని అతడు హత్య చేసినట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. మహిళ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.