కార్యక్రమంలో పాల్గొన్న మల్రెడ్డి రాంరెడ్డి..
కర్ణాటక రెడ్డి జనసంఘ (ఆర్) ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, క్రెడాయి చైర్మన్, తిరుపతి బిల్డింగ్ కమిటీ చైర్మన్ మురళీ కృష్ణా రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, సంఘం ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక రెడ్డి జనసంఘ అధ్యక్షులు జయరాం రెడ్డి, జనరల్ సెక్రటరీ శేఖర్ రెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
సభ ప్రారంభంలో మల్రెడ్డి రాంరెడ్డికి, మురళీ కృష్ణా రెడ్డికి, సందీప్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆత్మీయ ఆహ్వానం అందుకున్న అతిథులు సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు సంఘం ఐక్యతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు జయరాం రెడ్డి మాట్లాడుతూ, తిరుపతిలో ఇంటర్నేషనల్ రెడ్డి భవన్ నిర్మాణం కోసం కర్ణాటక రెడ్డి జనసంఘ (ఆర్) పూర్తి సహకారం అందించనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ భవన నిర్మాణం రెడ్డి సమాజానికి గొప్ప గౌరవం చేకూర్చుతోందని, దీని ద్వారా సేవా కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మల్రెడ్డి రాంరెడ్డి, ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, అటువంటి ప్రాజెక్టుల విజయానికి తగిన సలహాలు అందించనున్నట్లు చెప్పారు. ఈ సంఘం తరఫున కులాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎన్నో మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు లాంటి అనేక విద్యాసంస్థలు నడిపిస్తూ ఎంతో మంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దుతున్నందుకు అభినందనలు తెలిపారు. లక్షల సభ్యులు కలిగిన ఈ సంఘం వచ్చే నెలలో 100 సంవత్సరాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమం సంఘం ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని, సంఘం సభ్యుల త్యాగాలు, కృషి మరింత ప్రోత్సహించాలని అన్నారు.
ఈ సమావేశం సంఘం భవిష్యత్ లక్ష్యాలను సిద్ధించడంలో మరో మెట్టుగా నిలుస్తుందని సమావేశం పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.