కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు..
మంత్రి ఉత్సాహవంతుడే అయినా, అనుభవం, పరిణతి లేవని వ్యాఖ్య..
ఆ శాఖను రామ్మోహన్ నుంచి వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీకి సూచన..
అహ్మదాబాద్ లో సంభవించిన ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో క్లిష్టమైన పౌర విమానయాన శాఖను నిర్వహించేందుకు రామ్మోహన్ నాయుడు సమర్థుడు కాదని, ఆయనకు తగినంత అనుభవం లేదని పాల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ఒక సూచన చేశారు.
పౌర విమానయాన శాఖ ఎంతో క్లిష్టమైనదని, దానిని నిర్వహించడానికి అపారమైన నైపుణ్యం, పరిణతి, అనుభవం అవసరమని కేఏ పాల్ అన్నారు. 37 ఏళ్ల రామ్మోహన్ నాయుడు ఉత్సాహవంతుడు, చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి అయినప్పటికీ, ఈ కీలక శాఖను నడిపించడానికి అవసరమైన సామర్థ్యం ఆయనకు ఇంకా రాలేదని పాల్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతటి సున్నితమైన, సాంకేతికంగా అత్యంత కీలకమైన శాఖ బాధ్యతల నుంచి రామ్మోహన్ నాయుడిని తప్పించాలని ఆయన ప్రధానమంత్రికి సూచించారు. విమానయాన రంగం అనేక సవాళ్లతో కూడుకున్నదని, దానికి తగిన అనుభవజ్ఞులను మంత్రిగా నియమించాల్సిన అవసరం ఉందని పాల్ పరోక్షంగా తెలిపారు.