Friday, June 20, 2025
Google search engine
Homeతెలంగాణరూపురేఖ‌లు మార‌నున్న చ‌ర్ల‌ప‌ల్లి చెరువు

రూపురేఖ‌లు మార‌నున్న చ‌ర్ల‌ప‌ల్లి చెరువు

చెరువును సంద‌ర్శించిన ఉన్న‌తాధికారులు..
అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న హైడ్రా..
చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్..

చ‌ర్ల‌ప‌ల్లి చెరువు రూపు రేఖ‌లు మార‌నున్నాయి. మంచినీటి స‌ర‌స్సుగా రూపొందించ‌డ‌మే కాకుండా.. న‌య‌న మ‌నోహ‌రంగా దీనిని తీర్చిదిద్ద‌నున్నారు. జైళ్ల శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ సౌమ్య మిశ్రా ఆహ్వానం మేర‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గురువారం చ‌ర్ల‌ప‌ల్లి చెరువును సంద‌ర్శించారు. జైళ్లు శాఖ‌, హైడ్రాతో పాటు.. స్థానిక రెవెన్యూ, ఇరిగేష‌న్‌, జీహెచ్ ఎంసీ అధికారులుకూడా ఈ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. చ‌ర్ల‌ప‌ల్లి జైలు ప్రాంతంలో ఉన్న 58 ఎక‌రాల చ‌ర్ల‌ప‌ల్లి చెరువును ఆధునికీక‌రించ‌డంతో పాటు సుంద‌రంగా తీర్చిదిద్ద‌డంపై ఇరువురు ఉన్న‌తాధికారులు చ‌ర్చించారు. చెరువు చుట్టూ తిరిగి.. ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌ల‌ను ప‌రిశీలించారు. ప్ర‌స్తుతం చెరువులో కొద్దిమొత్తం నీరు ఉన్నా ప‌రిశుభ్రంగా ఉండ‌డంతో జీవ‌వైవిద్యానికి అవ‌కాశం ల‌భించింద‌ని.. ఇంకా ఈ చెరువు నిండా నీరుంటే మ‌రింత ఆహ్లాదంగా మారుతుంద‌ని భావించారు. ఈ క్ర‌మంలో చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి.. ప‌ర్యాట‌క‌, విహార కేంద్రంగా తీర్చిదిద్ద‌డంపై చ‌ర్చించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు.. క‌ట్ట‌ను బ‌లోపేతం చేసి పాత్‌వేను అభివృద్ధి చేయ‌డం వెంట‌నే చేప‌ట్టాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. అలాగే సోలార్ లైటింగ్ సిస్టమ్‌తో పాటు.. సీసీటీవీ కెమేరా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తే మ‌రింత భ‌ద్ర‌త ఉంటుంద‌ని భావించారు. ఇలా చెరువులో మంచి నీరు నిలిచేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌ను చ‌ర్చించారు. ఇందుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాల‌ని హైడ్రా ఇరిగేష‌న్ ఇంజినీరింగ్ విభాగానికి హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు.

ఆరేడు చెరువుల నుంచి నీరు :
హ‌కీంపేట నుంచి నాగిరెడ్డి కుంట‌, కాప్రా చెరువు, మోతుకుల‌కుంట‌, బైస‌న్‌కుంట గొలుసుక‌ట్ట‌ చెరువుల ద్వారా చ‌ర్ల‌ప‌ల్లి చెరువుకు నీరందుతుంది. ఈ చెరువుకు.. మురుగు నీరు క‌ల‌వ‌కుండా డైవ‌ర్ట్ నాలా కూడా ఉంది. చెరువు చుట్టూ దాదాపు 3 కిలోమీట‌ర్ల మేర న‌డ‌క దారి అందుబాటులోకి వ‌స్తుంది. చుట్టూ పాత్‌వే, మినీ పార్కులు, చెట్లు, సీటింగ్ సౌక‌ర్యం క‌ల్పించ‌డంతో పాటు.. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే స్థానికులే కాకుండా ఇదో విహార కేంద్రం అవుతుంది. చ‌ర్ల‌ప‌ల్లి ప‌రిశ్ర‌మ‌లకు చెందిన ప్ర‌తినిధులు సామాజిక బాధ్య‌త కింద నిధులు స‌మ‌కూర్చ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని సౌమ్య మిశ్రా చెప్పారు. ఒక్కో సెగ్మెంట్‌కు ఎంత ఖ‌ర్చు అవుతుందో స‌మ‌గ్ర నివేదిక ఇస్తే ఆ క్ర‌మంలో సీఎస్ ఆర్ నిధులు అడ‌గ‌డానికి వీలౌతుంద‌న్నారు. అంత‌కు ముందు చెరువుకు సంబంధించిన వీడియో చిత్రాల‌ను, చెరువు అభివృద్ధికి చెందిన ప్ర‌ణాళిక‌ల‌ను జైళ్ల శాఖ అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌లో చూపించారు. హైడ్రా అగ్నిమాప‌క శాఖ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య, జైళ్ల‌శాఖ ఐజీ ముర‌ళీ బాబు, డీఐజీలు డా. శ్రీ‌నివాస్‌, సంప‌త్, చ‌ర్ల‌ప‌ల్లి సెంట్ర‌ల్ జైలు సూప‌రింటెండెంట్ శివ‌కుమార్‌గౌడ్‌, ఓపెన్ జైలు సూప‌రింటెండెంట్ వెంక‌టేశ్వ‌ర్లు త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments