కేంద్ర ప్రభుత్వానికి సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ డిమాండ్..
కేరళలోని తిరువనంతపురంలో మూడు రోజుల జాతీయ సమావేశాలు..
దేశవ్యాప్తంగా సీనియర్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలని సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేరళలోని తిరవనంతపురంలో జరిగిన మూడు రోజుల సీనియర్ జర్నలిస్టుల జాతీయ సమావేశాల్లో సీనియర్ జర్నలిస్టుల సమస్యలపై చర్చించిన తర్వాత పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల సీనియర్ జర్నలిస్టులతో ఏర్పడిన “సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా” తీర్మానాలు చేసి ఆమోదించడం జరిగింది.

దేశవ్యాప్తంగా సీనియర్ జర్నలిస్టుల పరిస్థితి దుర్బలంగా, అనిశ్చితంగా ఉందని, చాలా రాష్ట్రాల్లో, జర్నలిజం వృత్తి నుంచి పదవీ విరమణ చేసిన జర్నలిస్టులు వివిధ అనారోగ్యాలు, కుటుంబ ఆర్థిక భారాలు, ఒంటరితనం వంటి అనేక సమస్యల మధ్య తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. సరైన ఆదాయం లేకపోవడంతో ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం సవాలుగా మారిందని, చాలా మంది విషయంలో స్వీయ, జీవిత భాగస్వామి వైద్య ఖర్చులు భరించలేనంత ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ తీవ్రమైన పరిస్థితిని చాలా అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని, అందువల్ల సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ మొదటి జాతీయ సమావేశం దేశవ్యాప్తంగా అర్హత కలిగిన సీనియర్ జర్నలిస్టులందరినీ కవర్ చేసే జాతీయ పెన్షన్ పథకాన్ని అత్యవసరంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. ప్రస్తుత తరం సీనియర్ జర్నలిస్టులు ఎటువంటి నిర్దిష్ట ఆదాయాన్ని సంపాదించనందున, పెన్షన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలని, భారత ప్రభుత్వం ప్రకటనల ద్వారా మీడియా సంస్థలకు భారీగా మద్దతు ఇస్తుందని, ప్రకటన చెల్లింపులో నిర్దిష్ట శాతాన్ని సంక్షేమ పథకానికి కేటాయించవచ్చని సమావేశం సూచించింది. వృత్తి నుండి పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు ప్రతిపాదిత జాతీయ పెన్షన్ పథకాన్ని దోహదపడేలా ప్రభుత్వం జర్నలిస్టు సంఘాలతో సంప్రదింపులు జరపాలని, సీనియర్ జర్నలిస్టులు నిర్ణయించి కోరితే తప్ప, ప్రతిపాదిత జాతీయ పెన్షన్ పథకం వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం అమలులో ఉన్న పెన్షన్ పథకాలను అమలు చేయకూడదని సమావేశం అభిప్రాయపడింది. జాతీయ పెన్షన్ పథకంపై సంప్రదింపులు ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్ జే ఎఫ్ఐ, వివిధ వర్కింగ్ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.
అదే విధంగా సీనియర్ జర్నలిస్టుల వైద్య ఆరోగ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకొని వీరిని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ ఎస్)లో చేర్చాలని సమావేశం డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇతర విభాగాల వారికి ఇస్తున్న సబ్సిడీ ఆరోగ్య బీమా పథకంలో సీనియర్ జర్నలిస్టులను చేర్చాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.దేశవ్యాప్తంగా సీనియర్ జర్నలిస్టులు చాలా కాలంగా రైళ్లలో పొందుతున్న రాయితీ ప్రయాణ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో తొలగించిందని, దీని వల్ల జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని, రాయితీ ప్రయాణాన్ని వెంటనే పునరుద్ధరించాలని సమావేశం డిమాండ్ చేస్తూ తీర్మానించింది.
సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావం :
కేరళలోని తిరువనంతపురం లో మూడు రోజుల పాటు జరిగిన సీనియర్ జర్నలిస్టుల జాతీయ సమావేశాల్లో “సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ జేఎఫ్ ఐ) ఆవిర్భావించింది. ఈ జాతీయ సంఘం అధ్యక్షుడిగా సందీప్ దీక్షిత్ (ఢిల్లీ), ఉపాధ్యక్షులుగా
ఆనందం పులిపలుపుల (తెలంగాణ), సుహాసిని ప్రభుగోంకర్ (గోవా), డాక్టర్ టి.జనార్దన్ (ఆంధ్ర ప్రదేశ్), చందర్ ప్రకాష్ భరద్వాజ్
(మధ్యప్రదేశ్), ప్రధాన కార్యదర్శిగా ఎన్ పీ చెకుట్టి (కేరళ), కార్యదర్శులుగా కె. శాంతకుమారి (కర్ణాటక), కన్హు నందా (ఒడిశా), ఆర్. రంగరాజన్ (తమిళనాడు), జైపాల్ పరశురామ్ పాటిల్ (మహారాష్ట్ర), కోశాధికారిగా కె.పి.విజయకుమార్ (కేరళ) కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా ఆర్ పీ సాంబసదాశివ రెడ్డి (కర్ణాటక), జార్జ్ కల్లివయలిల్ (ఢిల్లీ), ఎస్. సభానాయకన్ (పశ్చిమ బెంగాల్), రిమా శర్మ (అస్సాం), అభిజీత్ పాండే (బీహార్), అశ్వనీ కుమార్ (జమ్మూ కాశ్మీర్), ఉపేంద్ర సింగ్ రాథోడ్, (రాజస్థాన్), ప్రదీప్ ఫుటేల (ఉత్తరాఖండ్), సుమమా ఔసల్ (జార్ఖండ్), పి. పరమేశ్వర రావు (ఆంధ్ర ప్రదేశ్) తదితరులతో పాటు పలువురు నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేషనల్ కౌన్సిల్ లో తెలంగాణ నుంచి వల్లాల జగన్, శ్రీనివాస రెడ్డి, సారంగపాణి, మహ్మద్ రఫిలకు స్థానం లభించింది.


