18 నెలల్లో 11 మంది పురుషుల హత్య..
పట్టుకున్న పోలీసులు..
33 ఏళ్ల వయసు కల్గిన ఆ వ్యక్తికి పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అతడో హోమోసెక్సువల్. ఈ విషయం గుర్తించిన భార్య పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పురుషులతో శారీరకంగా కలుస్తూ వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు నిందితుడు. ఇదంతా బాగానే ఉన్న ఇటీవలే ఓ హత్య చేసి పోలీసులకు చిక్కాడీ నేరగాడు. అయితే విచారణలో భాగంగా తాను మరో 10 మందిని హత్య చేసినట్లు చెప్పాడు. ఇలా ఈ సీరియల్ కిల్లర్ మొత్తం కథ తెలుసుకున్న పోలీసులు.. బాధితుల మృతదేహాలను వెతికే పనిలో పడ్డారు.
పంజాబ్లోని హోషియాపూర్ జిల్లా గర్హశంకర్ చౌరా గ్రామానికి చెందిన 33 ఏళ్ల రామ్ సరూప్ అలియాస్ సోధికి ఇప్పటికే పెళ్లి అయింది. భార్యతో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే రామ్ సరూప్ ఓ హోమోసెక్సువల్. రెండేళ్ల క్రితం ఆ విషయం తెలుసుకున్న ఆయన భార్య.. పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడే పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే భార్య వెళ్లిపోయిన దగ్గర నుంచి రామ్ సరూప్.. ఒంటరిగా ఉంటున్నాడు. ఈక్రమంలోనే పురుషులతో శారీరక సంబంధాలు నడుపుతూ.. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈయన అడిగినంత డబ్బు వాళ్లు ఇవ్వకపోయినా, ఏదైనా గొడవ పెట్టుకున్న వెంటనే రామ్ సరూప్కి కోపం వచ్చేస్తుంది. దీంతో వెనకా ముందూ ఆలోచించకుండా.. తన దగ్గర ఉన్న చిన్న పదునైన గుడ్డతో వారి ప్రాణాలు తీసేవాడు. అది దొరకని పక్షంలో పక్కనే ఉన్న బండరాల్లు, ఇటుకలు వంటి వాటితో తలపై బాది చంపేవాడు. ఆపై తనకు ఏం తెలియదన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయేవాడు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 11 మంది పురుషులను హత్య చేశాడు.