ఓటర్ల జాబితా ప్రక్షాళనలో తూతూమంత్రపు ధోరణి వీడాలి:
క్షేత్రస్థాయి అధికారులకు హెచ్చరిక
హైదరాబాద్
ఓటరు నమోదు మరియు జాబితా ప్రత్యేక తీవ్ర పరిశీలన (ఎస్ఐఆర్) ప్రక్రియలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని యంత్రాంగానికి జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు . కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో ముమ్మరంగా సాగుతున్న ఈ ప్రక్షాళన చర్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.
*యంత్రాంగం అప్రమత్తత: అట్టడుగు స్థాయి పరిశీలన:
నియోజకవర్గంలోని నిర్దిష్ట పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న నోటీసుల పంపిణీ తీరును జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ ,ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు మరియు ఈఆర్ఓలతో కూడిన అధికార బలగంతో సమీక్ష నిర్వహించి, క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న ప్రతిబంధకాలను ఆరా తీశారు. నోటీసుల జారీలో ఆలస్యం తలెత్తకుండా, పారదర్శకతకు పెద్దపీట వేయాలని ఆదేశించారు.
*ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్య శ్రీరామరక్ష
ఈ తనిఖీ సందర్భంగా స్థానిక నివాసితులతో మమేకమైన యంత్రాగం, ఎస్ఐఆర్ ప్రక్రియ యొక్క చట్టబద్ధతను, ప్రాధాన్యతను ప్రజలకు విశదీకరించింది. ఓటర్లు తమకు అందిన నోటీసులలోని వివరాలను క్షుణ్ణంగా బేరీజు వేసుకోవాలని, నిర్దేశిత గడువులోగా సరైన ధృవీకరణ పత్రాలను సమర్పించి ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.


