- రహదారుల్లో ఆటంకాలు తొలగించాలంటూ విన్నపం
- *హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు: రక్షించాలంటూ బాధితుల ఆర్తనాదాలు
హైదరాబాద్:
మహానగరంలో ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఉద్దేశించిన స్థలాలు, పార్కులు, రహదారులు రియల్ మాఫియా, కబ్జాకోరుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. పౌరుల మౌలిక వసతులను కాలరాస్తూ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్న భూ దోపిడీదారుల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ బాధితులు, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా (HYDRAA) ప్రజావాణిని ఆశ్రయించారు. నగరవ్యాప్తంగా అక్రమణలపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేస్తూ ఒకే రోజు ఏకంగా 52 ఫిర్యాదులు అందడం విపరీత ధోరణులకు అద్దం పడుతోంది.

*శ్రుతిమించుతున్న ఆక్రమణలు.. వెలుగులోకి వచ్చిన ప్రధాన ఉదంతాలు:
- పెద్ద అంబర్పేటలో గ్రీన్ఫీల్డ్ కాలనీ మాయం: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేట పరిధిలోని సర్వే నంబర్లు 668 నుంచి 674 వరకు విస్తరించి ఉన్న 28 ఎకరాల గ్రీన్ఫీల్డ్ లేఅవుట్ను (1991లో ఆమోదించబడింది) అసాఘిక శక్తులు కబ్జాకు యత్నిస్తున్నాయి. 2018లో ఎల్ఆర్ఎస్ (LRS) అయిన ప్లాట్లతో సహా లేఅవుట్లోని రహదారులు, పార్కులను ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా విక్రయిస్తూ పాత గుర్తులను మాయం చేస్తున్న వైనంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
- మదీనాగూడలో ప్రజా ప్రయోజన స్థలానికి ఎసరు: మదీనాగూడ ఆర్టీసీ కాలనీలో వైద్య సదుపాయాలు, ప్రజానీకం అవసరాల కోసం కేటాయించిన 402 చదరపు గజాల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టేయడంపై ఆర్టీసీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
- మేకలమండి బస్తీలో ప్రభుత్వ భూమి స్వాహా: సర్వే నంబర్ 242 పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి, పక్కా ప్రహరీలతో పాటు అక్రమ నిర్మాణాలను చేపడుతుండటంతో స్థానికుల రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి.
- పటేల్గూడలో మూసుకుపోయిన ప్రధాన రహదారి: సృజన లక్ష్మీనగర్ ఫేజ్-2 లోని నాళా పక్కన గల రోడ్ నంబర్ 7 ను ఆక్రమించడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యంత రద్దీగా, సౌకర్యవంతంగా ఉండాల్సిన ఈ మార్గం మూసుకుపోవడంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు.
- గాజులరామారంలో చెరువు భూముల ఆక్రమణ: దేవేందర్నగర్ చింతల్ చెరువు ప్రాంతం (సర్వే నంబర్ 329) లో హైడ్రా గతంలో తొలగించిన అక్రమ నిర్మాణాలను మళ్లీ పునరుద్ధరిస్తూ, అనధికార విద్యుత్ కనెక్షన్లు పొంది చెరువు భూమిని ఆక్రమిస్తున్న తీరు పర్యావరణ సమతుల్యతకు పెను ముప్పుగా పరిణమించింది.
- వనస్థలిపురంలో పార్కు, ఆలయ స్థలానికి ఆశ: మారుతీనగర్ సర్వే నంబర్లు 158, 159, 179 లోని ప్లాట్లు 226, 227 లను కాలనీ ఆలయం, ప్రజా పార్కు కోసం కేటాయించగా, అక్కడ ఏకంగా అనుమతులు లేకుండా మూడు అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తూ ప్రజా ఆస్తులను కొల్లగొడుతున్నారు.
*చట్టపరమైన కఠిన చర్యలకు హైడ్రా కమిషనర్ ఆదేశం
ప్రజావాణికి వచ్చిన ఈ అక్రమణల ఫిర్యాదుల పట్ల హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అత్యంత గంభీరంగా స్పందించారు. నగరంలో పౌరుల జీవన హక్కులను, ప్రజా ఆస్తులను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేస్తూ, బాధితుల నుంచి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించారు. తక్షణమే క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా వెలసిన ఆక్రమణలను నేలమట్టం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో భూ ఆక్రమణదారుల ఆటలు సాగవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.



