హైదరాబాద్:
భారతీయ సనాతన సంస్కృతికి ప్రతీక అయిన వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని, రాజధానిలోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో పర్యావరణహిత మట్టి ప్రతిమ పూజోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ప్రకృతి పరిరక్షణే పరమావధిగా, భావితరాలకు స్వచ్ఛమైన హరిత నగరకానుకను అందించడమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న హైడ్రా యంత్రాంగం.. ఈసారి వినూత్న రీతిలో మట్టి గణనాథుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహించింది.
*ఆదిదేవుని ఆశీస్సులతో ప్రజాహిత యజ్ఞం:
హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ సోమవారం కార్యాలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన దివ్య మట్టి గణపతికి వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు సమర్పించారు. ఏ పవిత్ర కార్యమైనా విఘ్నే్వర పూజతోనే ఆరంభమవుతుందని, మహా గణపతి అనుగ్రహంతోనే ప్రజోపయోగకరమైన ప్రజాహిత కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయని కమిషనర్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. సమష్టి కృషితోనే నగర పునర్నిర్మాణం సాధ్యమని, గణేష్ ఉత్సవాలు అందరినీ ఒకతాటిపైకి తెచ్చి కర్తవ్య దీక్ష వైపు నడిపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
*పర్యావరణ పరిరక్షణే మన జీవన సూత్రం
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగాన్ని పూర్తిగా విడనాడి, మట్టి గణపతుల పూజ ద్వారానే జలవనరులను, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలని శ్రీ రంగనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతి సిద్ధమైన వర్షాలు సమృద్ధిగా కురిసి, నగరంలోని చెరువులన్నీ జలకళను సంతరించుకోవాలని, తద్వారా రాష్ట్రంలో పచ్చదనం పరిఢవిల్లాలని ఆ ఆదిదేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య, అడిషనల్ కమిషనర్లు శ్రీ సుదర్శన్, శ్రీ ఆనంద్కుమార్లతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని దైవకృపను పొందారు.



