*ముంపు ముప్పు తప్పిందంటూ రంగనాథ్ చర్యలపై హర్షం.. కదంతొక్కిన శేర్లింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు
*హైదరాబాద్:
నగరంలో చెరువుల పరిరక్షణ, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల పునరుద్ధరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ‘హైడ్రా’ (HYDRAA) వ్యవస్థకు ప్రజా మద్దతు వెల్లువెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి హైడ్రా చర్యలకు ఘన నివాళులర్పించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని తమ్మడికుంట చెరువు వద్ద మంగళవారం ఉదయం హైడ్రాకు మద్దతుగా భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు.
శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర గౌడ్ మరియు ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ ర్యాలీలో స్థానిక కాలనీ వాసులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*వర్షంలోనూ తరగని ఉత్సాహం
ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ, ప్రజల ఉత్సాహంలో ఏమాత్రం తగ్గలేదు. హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ చేపడుతున్న సాహసవంతమైన చర్యల వల్లనే ఈ వర్షాకాలంలో తమ కాలనీలకు వరద ముప్పు తప్పుతుందని స్థానికులు ముక్తకంఠంతో కొనియాడారు. ‘హైడ్రా ఉండాల్సిందే.. చెరువులను కాపాడుకోవాల్సిందే’ అంటూ నినాదాలతో తమ్మడికుంట ప్రాంతం మార్మోగింది.
*ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఆక్రమణల గుప్పిట్లో చిక్కుకున్న చెరువులను, నాలాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పిస్తే, దానిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడే ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. హైడ్రా దూకుడును అడ్డుకోవాలని చూసే స్వార్థపరుల ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడతారని ఈ ర్యాలీ ద్వారా స్పష్టమైంది.



