- మైనర్ బాలుడితో పనులు చేయిస్తున్నారంటూ ఆరోపణలు…
- అధికారుల చర్యల కోసం స్థానికుల ఎదురుచూపు
ఎల్బీనగర్:
మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీ ప్రధాన రహదారిపై గత కొన్నేళ్లుగా ప్రభుత్వ అనుమతి లేకుండా, ఇంట్లోనే మేకలను సంహారించి, కాలనీల్లో ప్రజల నివాసాల మధ్య ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా మేక మాంసం విక్రయిస్తున్నారంటూ, అసోసియేషన్ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారో స్పష్టత లేకుండానే వ్యాపారం కొనసాగుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మాంసం విక్రయించే ప్రాంతంలో పారిశుద్ధ్య పరిస్థితులు, వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా…? లేదా? అనే విషయంపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. నివాస ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాల వల్ల దుర్వాసన, అపరిశుభ్రత, ఈగలు, ఇతర పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
మైనర్తో పనులు చేయిస్తున్నారంటూ ఆరోపణలు
ఇదిలా ఉండగా, మాంసం విక్రయ కేంద్రంలో మైనర్ బాలుడితో పనులు చేయిస్తున్నారంటూ స్థానికులు మరో తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. బాలుడి వయస్సు, అతనితో చేయిస్తున్న పనుల స్వరూపం, పని వేళలు తదితర అంశాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల తనిఖీలు ఎప్పుడు..?
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఆహార భద్రత, బాలల హక్కులకు సంబంధించిన నిబంధనలపై సంబంధిత శాఖల అధికారులు సమగ్రంగా తనిఖీ చేసి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
“ప్రజల నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగితే అధికారులు ఎందుకు స్పందించడం లేదు?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి, వాస్తవ పరిస్థితులను స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.


