తన భర్తను హత్య చేయించిన భార్య..
కేవలం మూడు మేకలు ఇచ్చి..
తన కూతురి ప్రేమకు ఓ తల్లి సపోర్ట్ గా నిలిచింది. వాళ్ల ప్రేమ వ్యవహారం తండ్రి ఒప్పుకోలేదు. దీంతో ఆ తల్లి తన భర్తను హత్య చేయించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంట్లో ప్రేమ వ్యవహారం చెబితే.. తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అనే భయం చాలా మంది ప్రేమికులకు ఉంటుంది. అయితే కొంత మంది ఇంట్లో ధైర్యం చేసి తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పి.. వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. లేదంటే.. ప్రేమికులు ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఇంకా పరువు కోసం ఆలోచించి.. ఇద్దరు ప్రేమికులను తల్లిదండ్రులు చంపిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
కానీ ఇక్కడ మాత్రం విచిత్రం జరిగింది.. తన కూతురు ప్రేమను తల్లి ఒప్పుకుంది. ఈ ప్రేమకు తన భర్తే అడ్డువస్తున్నాడని సుఫారీ ఇచ్చి మరీ ఆమె హత్య చేయించింది. ఈ విషయం విచారణలో తెలవడంతో పోలీసులు కూడా కంగుతిన్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని రాజీవ్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మొక్కం ఆజనేయులు, భాగ్యలక్ష్మికి ఒక కూతురు ఉంది.
ఆమెకు ఓ యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. అతడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న భాగ్యలక్ష్మి వాళ్ల ప్రేమకు సపోర్ట్ గా నిలిచింది. కానీ.. వాళ్ల తండ్రికి నచ్చలేదు. వారి పెళ్లికి తండ్రి ఆంజనేయులు ఒప్పుకోలేదు. వద్దన్నా వినకుండా ప్రేమను కొనసాగిస్తుండడంతో కూతురిని మందలించాడు. ఈ వ్యవహారంలో భాగ్యలక్ష్మిపై కూడా ఆంజనేయులు చేయిచేసుకున్నాడు. కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని.. తన భర్తను చంపేయాలనే ఆలోచన ఆమెకు వచ్చింది. దీంతో అదే గ్రామంలో ఉంటున్న మైసమ్మకు ఈ విషయాన్ని చెప్పింది.. భర్తను చంపేయడానికి 3 మేకలను సుఫారీగా ఇచ్చింది. ఇక పథకం ప్రకారం ఆంజనేయులును మేకల షెడ్డు వద్ద పడుకోబెట్టగా.. అతడి కంట్లో కారం చల్లి మైసమ్మ ఆంజనేయులు గొంతు కోసి హత్య చేసింది. ఆమెకు మరో ఇద్దరు కూడా సహకరించారని పోలీసులు తెలిపారు. తర్వాత అక్కడ నుంచి గుట్టుచప్పుడు కాకుండా జారుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు విచారణను వేగవంతం చేసి.. నిజాలు రాబట్టారు. ఈ కేసులో భాగ్యలక్ష్మితో పాటు.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు..