Thursday, July 30, 2026
Google search engine
Homeతెలంగాణపెద్ద లక్ష్యాలే శ్రీరామరక్ష.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పిలుపు

పెద్ద లక్ష్యాలే శ్రీరామరక్ష.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పిలుపు

*డిగ్రీ కళాశాల ఏర్పాటు:
ఆరుట్ల పాఠశాలలో డిగ్రీ స్థాయి వరకు విద్యనందించేందుకు సత్వర చర్యలు.
విద్యార్థులు చెడు వ్యసనాలకు, వ్యర్థమైన విషయాలకు దూరంగా ఉండాలని హితవు.
*ఓటమే గెలుపునకు మెట్టు: అపజయాలను అధిగమిస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఆకాంక్ష.

*విద్యా రంగానికి ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం

విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మారుమూల గ్రామం ఆరుట్ల ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి ఉద్ఘాటించారు. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో డిగ్రీ కళాశాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మల్‌రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన “ఇన్‌స్పైర్-2026” సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.

ఇబ్రహీంపట్నం:

తల్లిదండ్రుల కష్టాలను వృథా కానివ్వకుండా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే ప్రభుత్వ కృషి సార్థకత చెందుతుందని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ప్రతీ మండలంలోనూ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. సామాజిక స్పృహతో భావిభారత పౌరులను తీర్చిదిద్దడంలో భాగస్వాములవుతున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.

*పెద్ద లక్ష్యాలతోనే ఉజ్వల భవిష్యత్తు: జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి
విద్యార్థి దశలోనే గట్టి సంకల్పంతో పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడే జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవడం సాధ్యమవుతుందని జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. నాటి విద్యా పరిస్థితులకు, నేటి ఆధునిక వసతులకు ఎంతో తేడా ఉందని, ప్రభుత్వం కల్పిస్తున్న సువర్ణావకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

*చదువుపైనే పూర్తి దృష్టి పెట్టాలి: ఏసీపీ కేపీవీ రాజు
మారుతున్న కాలంలో విద్యార్థులను పెడదోవ పట్టించే అంశాలపై ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు హెచ్చరించారు. విద్యార్థులు చెడు స్నేహాలకు, సమయాన్ని వృథా చేసే మార్గాలకు పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థి దశలో చదువు మినహా వేరే ధ్యాస ఉండకూడదని, ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు.

*ఆత్మస్థైర్యంతోనే విజయతీరాలు: మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి
మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని యువనేత మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి పిలుపునిచ్చారు. జీవితంలో గెలుపోటములు సహజమని, ప్రతి ఓటమిని ఒక మెట్లుగా మలచుకుని విజయతీరాలను చేరుకోవాలని సూచించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసానిచ్చారు.

*ఆకట్టుకున్న విద్యార్థుల ప్రతిభ
ఇన్‌స్పైర్-2026 వేదికపై తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సందేశ్, నవ్య చేసిన ప్రసంగాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాలలో అందుతున్న నాణ్యమైన విద్య, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వారు తెలుగు, ఆంగ్ల భాషల్లో అనర్గళంగా వివరించిన తీరును ముఖ్య అతిథులు ప్రశంసించారు.

*ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పీటీఏ-యూఎస్‌ఏ తోడ్పాటు
రాష్ట్రంలో విద్యాభివృద్ధి లక్ష్యంగా కలాం డైరీ, విద్యావారధి, సంకల్పసిద్ధి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్న పీటీఏ-యూఎస్‌ఏ ప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments