డిజిటల్ అరెస్ట్ లో చిక్కుకున్న బిజినెస్ మెన్..
డబ్బులకోసం వ్యాపారికి బెదిరింపులు..
సైబర్ మోసగాళ్ల ‘డిజిటల్ అరెస్ట్’ నుంచి ఒక వ్యాపారిని పోలీసులు కాపాడారు. ట్రాయ్, సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ డబ్బుల కోసం వ్యాపారిని బెదిరించిన స్కామర్ల ప్లాన్ను భగ్నం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. అరేరా కాలనీకి చెందిన బిజినెస్ మ్యాన్ వివేక్ ఒబెరాయ్కు రెండురోజుల క్రితం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారినని ఒక వ్యక్తి పేర్కొన్నాడు. సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా పేర్కొన్న వ్యక్తులతో అతడి కాల్ను కనెక్ట్ చేశాడు.
కాగా, వివేక్ ఒబెరాయ్ ఆధార్తో పలు బోగస్ బ్యాంకు ఖాతాలున్నాయని స్కామర్లు ఆరోపించారు. ఆయన పేరుతో కొనుగోలు చేసిన సిమ్ కార్డులను చట్టవిరుద్ధ కార్యకలాపాలు, మార్కెటింగ్ కోసం వినియోగించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్లు భయపెట్టారు. స్కైప్ వీడియో యాప్ను డౌన్లోడ్ చేయాలని, ఆ గదిలోనే ఉండాలని చెప్పారు.
మరోవైపు ‘డిజిటల్ అరెస్ట్’ గురించి వివేక్ ఒబెరాయ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. స్కైప్ వీడియో ద్వారా సైబర్ మోసగాళ్లతో మాట్లాడారు. వారి ఐడీ వెరిఫికేషన్ కోసం డిమాండ్ చేయగా వీడియో కాల్ను కట్ చేశారు. కాగా, ‘డిజిటల్ అరెస్ట్’ సందర్భంగా ఆ వ్యాపారి బ్యాంకు వివరాలను సైబర్ నేరగాళ్లు పొందారని పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఆయన వారికి మనీ ట్రాన్స్ఫర్ చేయలేదని చెప్పారు. ఈ సంఘటనపై సెబర్ సెల్ దర్యాప్తు చేస్తున్నదని వెల్లడించారు.