తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం అమరన్ సినిమాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఈ సినిమా నడుస్తున్న థియేటర్ ముందు ఇద్దరు వ్యక్తులు బాంబుతో దాడి చేశారు. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ అమరన్. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా ఈ సినిమా రాగా.. ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఈ సినిమా నడుస్తున్న అలంగర్ థియేటర్పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటికి రాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఇక ఈ దాడిలో ఎవరికి గాయాలు కాలేదని.. స్థానిక గొడవల కారణంగానే ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.