డబ్బు దండుకుని బిచాణా ఎత్తేసిన భార్యాభర్తలు..
అధిక వడ్డీకి, సులువైన సంపాదనకు ఆశపడితే అంతే సంగతులు..
ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి..
మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఇక ముందు నమ్మించి మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. చిట్టీల పేరుతో 20 కోట్ల రూపాయల మోసానికి పాల్పడి దంపతులు అదృశ్యమైన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో బాపూజీ నగర్ కు చెందిన 53 సంవత్సరాల అమరేందర్ యాదవ్, 49 సంవత్సరాల సబితా దంపతులు అందరినీ నమ్మించి గత 20 సంవత్సరాలుగా ప్రైవేటు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వారు చిట్టి పాట పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అయితే పోయిన నెలలో 14వ తేదీన దంపతులు ఇద్దరు కనిపించకుండా వెళ్ళిపోయారు. అయితే తమ చిట్టి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారు పారిపోయారని తాము నష్టపోయామని భావించిన బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు .అయితే ఈ క్రమంలో మళ్లీ వాళ్లకు వాళ్లే వచ్చి పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఇక చిట్టి వ్యాపారం పేరుతో తమను మోసం చేశారని భావించిన నిందితులు మళ్లీ పోలీస్ స్టేషన్ కు వచ్చారని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ధర్నా నిర్వహించారు . కానీ ఎంతో కష్టపడి కూడా పెట్టుకున్న డబ్బులు చిట్టిల వ్యాపారం పేరుతో తీసుకుని తమను మోసం చేశారని వాపోతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని, తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, ఉన్నత చదువుల కోసం, వివిధ అవసరాల కోసం ఉపయోగించుకుందామని చిట్టీల రూపంలో దాచుకున్న డబ్బులు తీసుకొని భార్యాభర్తలు ఉడాయించారని వారు మండిపడుతున్నారు.
ఒక్కొక్కరం వారి వద్ద పది లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు చొప్పున చిట్టీలు వేసి మోసపోయామని అంటున్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని మహిళలు వృద్ధులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.