రాణించిన టీం ఇండియా
5 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా 104 పరుగులకు అల్ ఔట్
బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత బౌలర్లు ఆస్ట్రేలియాను వణికించారు . ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్లో 104 పరుగులకు ఆలౌట్ చేశారు. ఓవర్నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కాసేపటికే ఆసీస్కు షాక్ తగిలింది. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తోన్న అలెక్స్ కేరీ (21)ని బుమ్రా అద్భుతమైన బంతికి ఔట్ చేశాడు.

అనంతరం మిచెల్ స్టార్క్ (26: 112 బంతుల్లో 2 ఫోర్లు) చాలాసేపు భారత బౌలర్లను వికెట్ పడకుండా క్రిస్ లో నిలబడ్డాడు . హేజిల్వుడ్ (7*)తో కలిసి పదో వికెట్కు విలువైన పరుగులు (110 బంతుల్లో 25 రన్స్) రాబట్టాడు. ఈ క్రమంలో లంచ్ బ్రేక్కు ముందు చివరి ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్లో స్టార్క్ భారీ షాట్కు యత్నించాడు. రిషభ్ పంత్ అద్భుతమైన క్యాచ్తో ఔట్ అయ్యాడు . ఆసీస్ ఇన్నింగ్స్లో అతడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల ఆధిక్యం దక్కింది. ఉస్మాన్ ఖావాజా 8, మెక్స్వీనీ 10, లబుషేన్ 2, స్టీవ్ స్మిత్ డకౌట్, ట్రావిస్ హెడ్ 11, మిచెల్ మార్ష్ 6, అలెక్స్ కేరీ 21, కమిన్స్ 3, నాథన్ లైయన్ 5 పరుగులు చేశారు.
భారత్, ఆసీస్ తొలి ఇన్నింగ్స్లు ముగిశాయి. మొత్తం 20 వికెట్లూ పేసర్లకే దక్కడం గమనార్హం. ఆస్ట్రేలియా బౌలర్లు జోష్ హేజిల్వుడ్ 4, మిచెల్ స్టార్క్ 2, కమిన్స్ 2, మిచెల్ మార్ష్ 2 వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా 5, హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 తీశారు. బుమ్రా ఐదు అంతకంటే ఎక్కువ వికెట్ల ప్రదర్శన చేయడం ఇది 11వ సారి. ఆసీస్ గడ్డపై ఇది రెండోసారి కావడం విశేషం.
అయితే ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా మరో అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సరసన నిలిచాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై ఏడోసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో కపిల్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.