26/11 ముంబై మారణహోమానికి 16 ఏళ్లు..
ఇప్పటికీ కన్నీళ్లు తెప్పించే సంఘటన..
పాకిస్తానీ ఉగ్రవాదుల దుశ్చర్య..
మారణహోమం సృష్టించిన దుర్మార్గులు..
సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించిన పాకిస్థానీ ఉగ్రవాదులు.. నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు మతమయ్యారు.
16 ఏళ్ల క్రితం అంటే 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సహా అనేక ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి అజామ్ ఛీమా కీలక సూత్రధారిగా గుర్తించారు. దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు అజామ్ శిక్షణ ఇచ్చినట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాది కసబ్ను సజీవంగా పట్టుకున్నారు. కోర్టు ఉరి శిక్ష విధించడంతో 2012 నవంబర్ 21న పూణేలోని ఎరవాడ జైలులో ఉరి తీశారు. 26/11 పేలుళ్ల ఘటన మాత్రమే కాకుండా ఇతర బాంబు పేలుళ్లకు కూడా అజామ్ సూత్రధారిగా వ్యవహరించారు. 2006లో ముంబై రైళ్లలో జరిగిన బాంబు పేలుడు వెనుక అతని హస్తం ఉందని అప్పట్లో తేల్చారు. ఈ పేలుళ్లలో 188 మంది ప్రాణాలు కోల్పోగా.. 800 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు.