జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది..
రక్తహీనతను మెరుగుపరుస్తుంది..
నిద్రలేమికి తొలగించి గాఢంగా నిద్రపట్టేలా చేస్తుంది..
రోజూ ఉదయం చాలా మంది అనేక రకాల ఆహారాలను తింటుంటారు. ఉదయం చాలా మంది తినే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, పూరీ వంటివి ఉంటాయి. అయితే వీటితోపాటు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా రోజువారి దినచర్యలో భాగం చేసుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్తోపాటు పలు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్లో ఖర్జూరాలు రెండింటిని తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. ఖర్జూరాలు, పాలు.. ఈ రెండింటిలోనూ మన శరీరానికి అవసరం అయ్యే ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ రెండింటినీ ఉదయం తీసుకుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుందని వారు అంటున్నారు.
ఖర్జూరాలు తియ్యగా ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఖర్జూరాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. అలాగే పాలలో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు ఉంటాయి. అలాంటప్పుడు రెండింటినీ కలిపి తీసుకుంటే మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే నీరసంగా, అలసటగా ఉండేవారు, రోజంతా శక్తి లేనట్ల ఫీలయ్యే వారు ఉదయం ఖర్జూరాలు రెండింటిని తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగితే చాలు, రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్గా పనిచేస్తారు. ఎంత పనిచేసినా అలసట అనేది ఉండదు. ఇక ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఖర్జూరాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మలబద్దకం ఉండదు. సుఖ విరేచనం అవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అలాగే కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఉదయాన్నే ఖర్జూరాలను తిని పాలను తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. రక్తహీనత ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. రక్తం కావల్సినంత తయారవుతుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఖర్జూరాల్లో, పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరాల్లో మెగ్నిషియం కూడాఎక్కువగానే ఉంటుంది. ఇది క్యాల్షియం శోషణను అధికం చేస్తుంది. దీంతో ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి.
ఖర్జూరాల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఐరన్, పొటాషియం, విటమిన్ బి6 ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. అలాగే పాలలో ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. ఇవి శరీర సహజ సిద్ధమైన రక్షణ వ్యవస్థను పటిష్ట పరుస్తాయి. అందువల్ల రెండింటినీ కలిపి తీసుకుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఖర్జూరాల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. అందువల్ల రెండింటినీ కలిపి రాత్రి పూట తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అయి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతో పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఇలా ఖర్జూరాలు, పాలను కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు.