‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఈ పండుగకు సూపర్ హిట్ను అందుకున్నాడు నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమిది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలుగా నటించారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా హౌస్ ఫుల్ బోర్డ్తో నడుస్తుంది. మహిళా ప్రేక్షకులు అధిక సంఖ్యలో థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నిర్మాత దిల్ రాజుతో పాటు అతడి భార్య అనిత.. శిరీష్, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి తదితరులు స్వామివారి సేవలో పాల్గోన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం బయటకి రాగా.. అభిమానులు వీరితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.