కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర క్రీడా శాఖ..
కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసింది. తద్వారా దేశీయ టోర్నమెంట్ల నిర్వహణకు, అంతర్జాతీయ టోర్నమెంట్లకు జాతీయ జట్ల ఎంపికకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు మార్గం సుగమం చేసింది.
కాగా, డబ్ల్యు.ఎఫ్.ఐ.కి జరిగిన ఎన్నికల్లో సంజయ్ సింగ్ నేతృత్వంలోని ప్యానెల్ 2023 డిసెంబర్ 21న విజయం సాధించిన విషయం తెలిసిందే. సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం అండర్-15, అండర్-20 జాతీయ పోటీలను ఉత్తరప్రదేశ్లోని గోండాలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. రెజ్లర్లు పోటీలకు సిద్ధమయ్యేందుకు సమయం ఇవ్వకుండా ప్రకటన వెలువరించిన కారణంగా కొత్త కార్యవర్గంపై వేటు వేసింది. క్రీడా శాఖ విధివిధానాలను అమలు చేయలేదనే కారణంతో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని 2023, డిసెంబర్ 24న క్రీడా శాఖ వెల్లడించింది. అయితే, ప్రస్తుతం దిద్దిబాటు చర్యలు తీసుకున్న కారణంగా డబ్ల్యూఎఫ్ఐపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది.