తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు పిర్యాదు చేసిన యువతి..
కానిస్టేబుల్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడని ఆరోపణ..
మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి మోసం చేశాడు..
మామ కూడా అసభ్యంగా ప్రవర్తించేవారని ఆరోపణ..
గుంటూరులో ఓ హోంగార్డు తన భార్యను దారుణంగా హింసిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ అని నమ్మించి పెళ్లి చేసుకున్న నిందితుడు ఆ తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టడమే కాకుండా అశ్లీల వీడియోలు చూపిస్తూ శారీరకంగా చిత్రహింసలకు గురిచేశాడు. అతడి వేధింపులు భరించలేని బాధితురాలు తల్లితో కలిసి నిన్న గుంటూరు పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
బాధితురాలి తెలిపిన కథనం ప్రకారం.. పాత గుంటూరుకు చెందిన బాధిత యువతి బీఎస్సీ పూర్తి చేసింది. 8 నెలల క్రితం అలీనగర్కు చెందిన ఫణీంద్రకుమార్తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఫణీంద్రకుమార్ తాను కానిస్టేబుల్గా పనిచేస్తున్నానని చెప్పినట్టు బాధితురాలు పేర్కొంది. వివాహానంతరం అత్తారింటికి వెళ్లాక అతడు హోంగార్డుగా పనిచేస్తున్నాడని తెలిసిందని ఆవేదన వ్యక్తం చేసింది.
కొన్ని రోజులకు ఫణీంద్రకుమార్ మరో మహిళతో ఉన్న ఫోటో ఒకటి బాధితురాలి కంటపడింది. దీనిపై ఆరా తీయగా అతడికి మూడేళ్ల క్రితమే పొత్తూరుకు చెందిన మరో మహిళతో వివాహమైందని, ఆ విషయాన్ని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసిందని తెలిపింది. ఈ మోసం గురించి నిలదీయడంతో తనపై దాడికి పాల్పడ్డాడని, దుర్భాషలాడుతూ చిత్రహింసలకు గురిచేశాడని కన్నీళ్లు పెట్టింది. అశ్లీల వీడియోలు చూపిస్తూ తీవ్రంగా హింసించేవాడని, కొన్నిసార్లు రక్తం వచ్చేలా గాయపరిచి, మూత్రం కూడా తాగించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
భర్త ఇంట్లో లేని సమయాల్లో మామ కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించేవారని ఆరోపించింది. ఈ వేధింపులు భరించలేక ఇటీవలే పుట్టింటికి వచ్చేసినట్టు తెలిపిన బాధితురాలు.. ఫణీంద్రకుమార్పై కఠిన చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. స్పందించిన అధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.