నిస్సిగ్గుగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు..
తీవ్ర విమర్శలు చేసిన మధు యాష్కీ గౌడ్..
చంపాపేట డివిజన్ మారుతీ నగర్ లో పర్యటన..
స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల స్వార్థం కోసం జీవో నం.118 తీసుకువచ్చి ప్రజలను మోసం చేశారని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ విమర్శించారు. చంపాపేట డివిజన్ లోని మారుతి నగర్ కాలనీలో మంగళవారం రోజు పర్యటించారు. కాలనీలో రూ.1.80 కోట్ల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. కాలనీలో రోడ్లు మంజూరు చేసినందుకు మధుయాష్కీకి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీవాసులు మాట్లాడుతూ.. జీఓ 118 ద్వారా తాము మోసపోయామని, బ్యాంకు లోన్లు రావడంలేదని, ఆపదకు ఇళ్లను అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని, భవనాలు ఉన్నప్పటికీ వెకెట్ ల్యాండ్ టాక్స్ వస్తున్నాయని.. తమ సమస్య పరిష్కరించాలని మధుయాష్కిని కోరారు.
ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ.. తప్పుల తడకతో, ప్రజలు కష్టార్జితంతో కొనుక్కున్న స్థలాలకు భూ ఆక్రమణదారులుగా ముద్రవేసి జీఓ 118 తీసుకు రావడమే కాకుండా.. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంకా అబద్ధాలు , మోసాలతో ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు.. హుడా చైర్మన్ గా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరిస్తారని గెలిపించిన ప్రజలను, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి సుధీర్ రెడ్డి పార్టీ మారాడు అన్నారు. కానీ ఆ సమస్య పరిష్కరించకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు.. ఇల్లు నిర్మించుకొని ఉన్నప్పటికీ వెకెట్ ల్యాండ్ టాక్స్ వస్తున్న విషయంపై ఇటీవల జిహెచ్ఎంసి కమిషనర్ ను కలిసి మాట్లాడినట్లు వివరించారు. త్వరలోనే సరి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని తెలిపారు.. జీఓ 118 బాధితుల సమస్య ఇటీవల సీఎం దృష్టికి తీసుకెళ్లామని, సీఎం రేవంత్ రెడ్డికి కూడా పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రజలకు సంపూర్ణ హక్కులు లభించేలా సమస్య పరిష్కరించేందుకు సీఎంతో మాట్లాడుతున్నట్లు వివరించారు.
నియోజకవర్గంలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు సాఫీగా జరిగేందుకు సహకరిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం చేసిన మాదిరిగా జిహెచ్ఎంసి నిధులు ఇతర పనులకు మళ్లించకుండా.. జిహెచ్ఎంసి పరిధిలోనే అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో మారుతి నగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు రమేష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్, మారుతి నగర్ ఈస్ట్ సంక్షేమ సంఘం ప్రతినిధులు రమణయ్య, జైపాల్ రావు, నాయకులు రఘునందన్ రెడ్డి, కర్మన్ఘాట్ దేవాలయ కమిటీ డైరెక్టర్లు దుర్గారెడ్డి, తోకటి కిరణ్, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.