అన్ని శాఖలతో హైడ్రా సమన్వయం..
ట్రాఫిక్ పోలీసులతో సమావేశమైన హైడ్రా అధికారులు..
రహదారులు నీట మునగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. సమస్య ఎలా పరిష్కారం అవుతుందనే అంశంపై స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించిన శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తే సమస్యను చాలా వరకు పరిష్కారం చేయగలమన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే జీహెచ్ ఎంసీతో కలసి పని చేస్తున్న హైడ్రా.. మంగళవారం ట్రాఫిక్ పోలీసు ఉన్నతాదికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసింది. జాయింట్ సీపీలు గజరావు భూపాల్, జోయిల్ డేవిస్, హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వి. పాపారావుతో పాటు హైడ్రా, ట్రాఫిక్ పోలీసు విభాగాలకు సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా వరద నీట మునిగిన ప్రాంతాలలో తలెత్తుతున్న సమస్యలను అధికారులు వివరించారు. రెండు గంటల పాటు వర్షం పడితే ఒక మీటరు ఎత్తున నీరు చెరువుల్లో చేరుతోందని.. ఇంతే మొత్తం వాటర్ బయటకు వెళ్లాలంటే వారం రోజులు పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో వరదను నిలువరించే చెరువుల నీటి మట్టంపైనా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని హైడ్రా కమిషనర్ సూచించారు.
నీట మునుగుతున్న ప్రాంతాలు 349 :
నగరంలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 349 ప్రాంతాలలో వరద ముప్పు ఉందని గుర్తించారు. వర్షం సమాచారం తెలియగానే ఈ ప్రాంతాలలో సంబంధిత శాఖల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఈ ప్రాంతాలకు దగ్గరలో చెరువులు, నాలాలు అనుసంధానమై ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. వరద కాలువలు ఎక్కడైనా కుంచించుకుపోయినా.. పూడుకు పోయినా ఆ సమాచారం ఇస్తే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్లోని ప్యాట్నీ, చికోటీ గార్డెన్స్, చింతలబస్తీల మీదుగా సాగే వరద కాలువలను విస్తరిస్తున్నామని చెప్పారు. చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే వెంటనే తొలగించాలని కోర్టులు స్పష్టమైన తీర్పులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
3 రోజుల్లో మాన్సూన్ ఎమర్జన్సీ బృందాలు :
51 హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలకు 150 మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్లు కూడా 3 రోజుల్లో తోడవుతున్నాయని హైడ్రా కమిషనర్ చెప్పారు. సర్కిళ్ల వారీ జీహెచ్ ఎంసీ సిబ్బందితో కలిసి ఈ బృందాలు పని చేస్తాయన్నారు. వీటికి జలమండలి, ట్రాఫిక్, ఇరిగేషన్, విద్యుత్ శాఖలకు చెందిన సిబ్బంది కూడా తోడయితే.. నగరానికి వరద ముప్పు చాలావరకు తగ్గించవచ్చునన్నారు. 50 మేజర్ సమస్య ఉన్న ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి తొలుత ప్రయత్నిద్దామన్నారు. వర్ష సమచారంతో పాటు.. సమస్యల పరిష్కారానికి తీసుకునే చర్యలు సమన్వయంతో సాగేందుకు వీలుగా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్రేక్డౌన్ అవుతున్న వాహనాలను పక్కకు తీయడానికి తగిన వాహనాలను ప్రాంతాలవారీ సమకూర్చుకోవాలని ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీలు కోరారు. నగరంలో ఏ ప్రాంతాల్లో వరద ముప్పు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయో వివరించారు.