దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నగరంలో లైవ్ ఈవెంట్..
నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీలో కార్యక్రమం..
30 ఏళ్ల సంగీత ప్రస్థానం సందర్భంగా ‘వండర్మెంట్ టూర్’..
2017 నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసిన రెహమాన్..
మరో చరిత్ర సృష్టిద్దామంటూ అభిమానులకు పిలుపు..
ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏ.ఆర్. రెహమాన్ అభిమానులకు ఓ తీపి కబురు. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన హైదరాబాద్లో సంగీత విభావరి నిర్వహించబోతున్నారు. నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా నవంబర్ 8న ఈ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని రెహమాన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
రెహమాన్ తన 30 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని ‘వండర్మెంట్ టూర్’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ టూర్లో భాగంగానే హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చివరిసారిగా 2017లో రెహమాన్ హైదరాబాద్లో ఓ మెగా ఈవెంట్లో పాల్గొని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మళ్లీ ఇన్నేళ్లకు ఆయన ప్రదర్శన కోసం నగరంలోని సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ కాన్సర్ట్పై రెహమాన్ తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. “హలో హైదరాబాద్! అతిపెద్ద ఇండియన్ మ్యూజికల్ ఈవెంట్ ఇప్పుడు మీ నగరానికి వస్తోంది. 2017లో 25 వేల మంది ఒకేసారి ‘మా తుఝే సలామ్’ పాట పాడినప్పుడు ఒళ్లు గగుర్పొడిచిన క్షణాలు గుర్తున్నాయా? అది సంగీత చరిత్రలో నిలిచిపోయింది. ఈసారి అంతకుమించి మరో రికార్డు సృష్టిద్దాం” అని అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ ప్రకటనతో ఆయన అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.