సిద్దిపేట:
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణ మహోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో నేత్ర పర్వంగా ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహించడం జరిగింది. కళ్యాణం అనంతరం దాతల ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ చేశారు. కళ్యాణం అనంతరం స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఈ పల్లకి సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవింద నామస్మరణతో ఊరంతా భక్తి మయంగా మారింది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేడుకలో స్థానిక ప్రముఖులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


