- హయత్ నగర్ హైవేపై నిబంధనలకు తిలోదకాలు..
రెసిడెన్షియల్ ముసుగులో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం! - బిల్డ్ నౌ వెబ్సైట్లో పరదర్శకత లోపం తో అధికారుల అవినీతి, అక్రమ నిర్మాణాల ప్రోత్సాహం.. కోట్ల రూపాయల పన్నులలూటి..!
- హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అజ్మీర స్వామి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో చర్యలు ఎక్కడ..?
- నిఘా విభాగాలు, ఎం.ఎం.సి విజిలెన్స్ అధికారుల చర్యలు ఎక్కడ..?
- మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టి సారించాలి..
ఎల్బీనగర్:
విజయవాడ హైవే హయత్ నగర్ మెయిన్ రోడ్ ఆనుకొని హైవే నిబంధనలు పాటించకుండా , మున్సిపల్ నిబంధనలను పాటించకుండా, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా రెండు రెసిడెన్షియల్ అనుమతులతో ఆక్యుపెన్సి మార్టిగేజ్ ఎగవేస్తూ, లక్షల్లో ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తూ భారీ అక్రమ నిర్మాణం చేపడుతున్నారు అంటూ పదుల సంఖ్యలో రాతపూర్వక ఫిర్యాదులు, వార్త కథనాలు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్న, టౌన్ ప్లానింగ్ అధికారులు టిపిఎస్ సోమేష్, ఏసిపి విజయలక్ష్మి..
చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గల యంత్రాంగమే అవినీతికి తెరలేపడంతో, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి సాగుతున్న ఈ అనధికార నిర్మాణ పర్వంపై స్థానికులు మరియు ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని కెప్టెన్ కుక్ హోటల్ పక్కన, విజయవాడ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 263, ప్లాట్ నంబర్ 23లో జరుగుతున్న భారీ వాణిజ్య నిర్మాణమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.

*శాస్త్రీయ, సాంకేతిక లోపాలు – నిబంధనల ఉల్లంఘనలు:
- రెసిడెన్షియల్ ముసుగులో కమర్షియల్ దందాలు: నిబంధనల ప్రకారం 400 గజాల స్థలాన్ని రెండు భాగాలుగా విభజించి, ఒక్కో ప్లాట్కు 200 గజాల చొప్పున జీ ప్లస్ టు (G+2) రెసిడెన్షియల్ (నివాస గృహాల) అనుమతులు పొందారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా వాణిజ్య అవసరాల కోసం బహుళ అంతస్తుల భారీ నిర్మాణాన్ని తలపిస్తూ పనులు సాగిస్తున్నారు.
- పన్ను ఎగవేత – మార్టిగేజ్ మోసం: వాణిజ్య భవనాలకు చెల్లించాల్సిన భారీ అభివృద్ధి రుసుములు, మున్సిపల్ ఫీజులు, మరియు మున్సిపాలిటీకి కేటాయించాల్సిన మార్టిగేజ్ స్థలాన్ని ఎగవేసి కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారు.
- అతిలోతైన సెల్లార్ తవ్వకాలు – పెను ప్రమాదం: ఎలాంటి ఇంజనీరింగ్ ప్రమాణాలు పాటించకుండా, భారీ యంత్రాలతో అతిలోతైన సెల్లార్ను తవ్వడంతో చుట్టుపక్కల ఉన్న నివాస భవనాల పునాదులు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
- గాలికి సెట్బ్యాక్లు – ఫుట్పాత్ కబ్జా: జాతీయ రహదారి నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, కనీస సెట్బ్యాక్ వదలకుండా రోడ్డు స్థలాన్ని ఆక్రమించారు. పాదచారులు నడిచే ఫుట్పాత్ను సైతం కబ్జా చేసి నిర్మాణ సామగ్రిని నిల్వ చేయడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోంది.
*అధికారుల మౌనం వెనుక చీకటి ఒప్పందాలు!
ఈ భారీ అక్రమ కట్టడంపై స్థానికులు ఆధారాలతో సహా మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, మరియు హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సరిగ్గా రెండు నెలలు గడుస్తున్నా.. నేటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఫిర్యాదులు అందించి నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయి పరిశీలన జరపకపోవడం, అక్రమార్కులపై కనీస చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులకు, సదరు భవన యజమానులకు మధ్య కుదిరిన చీకటి ఒప్పందాలు ఏపాటివో స్పష్టమవుతున్నాయి. హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ అజ్మీర స్వామి, టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు నేటికీ సమాధానం కరువైంది.
*భవిష్యత్తులో తీవ్ర ముప్పు – ప్రజల హెచ్చరిక:
హైవేను ఆనుకొని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భారీ భవనం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ట్రాఫిక్ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా, సరైన సెట్బ్యాక్లు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి, తక్షణమే ఈ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలి. నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్న భవనాన్ని కూల్చివేయడంతో పాటు, ఈ అవినీతి తంతుకు సహకరిస్తున్న బాధ్యులైన టౌన్ ప్లానింగ్ అధికారులపై శాఖాపరమైన మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో ఐ.ఏ.ఎస్., మరియు మున్సిపల్ కార్పొరేషన్ విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.



