శుచి, శుభ్రత ఉన్నచోట లక్ష్మి కొలువై ఉంటుంది..
సంపదను సత్కార్యాలు వినియోగించడమే లక్ష్మి ఆరాధన..
దీపావళి సంతసం ధన త్రయోదశితో మొదలవుతుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఈ పర్వం నిర్వహించుకుంటారు. ధన త్రయోదశి నాడు మహాలక్ష్మి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని, ప్రతి లోగిలిలో సంచరిస్తుందని పెద్దలు చెబుతారు. శుచి, శుభ్రత, సంప్రదాయం పాటించే ఇంట్లో కొలువుదీరుతుందట. అందుకే, అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఉదయాన్నే ఇల్లూ, వాకిలీ శుభ్రం చేసుకొని, ముగ్గులు తీర్చిదిద్దాలి. ఇంట్లోవారంతా అభ్యంగన స్నానం చేసి, శుభ్రమైన వస్ర్తాలు ధరించి, పూజామందిరాన్ని మంగళకరంగా అలంకరించుకొని లక్ష్మీపూజ చేయాలి. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక లక్ష్మీదేవి పూజలో భాగంగా ఇంట్లో వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు ఆవుపాలతో శుభ్రం చేసి పూజామందిరంలో ఉంచాలి. లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ వాటిని పూజించాలి.

సంపదను సత్కార్యాలకు సద్వినియోగం చేయటమే లక్ష్మీదేవి ఆరాధనలో ఆంతర్యం. ఇందుకు తగిన సంకల్పంతో దీక్షను పొందడానికి ధనత్రయోదశి వేదికగా నిలుస్తుంది. ఆనాడు లక్ష్మీపూజ చేసినవారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం వివరిస్తున్నది. ఆనాటినుంచి దీపావళి వరకు మూడురోజులపాటు ‘గో త్రిరాత్ర వ్రతం’ నిర్వహించాలని, గోమాతను లక్ష్మీ స్వరూపంగా గుర్తించి గో సేవ చేయాలనీ ఆ గ్రంథం చెబుతున్నది. ధనత్రయోదశి నాడు పితృదేవతలు తమ వారసులను ఆశీర్వదించటానికి భూమికి దిగి వస్తారని, వారికి దారి చూపటానికి ఇంటిలో దక్షిణం వైపుగా దీపం పెట్టాలని కూడా పెద్దలు సూచించారు. దీనిని ఆచరించినవారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆవు నెయ్యితో వెలిగించిన దీపాలతో ఇంటిని అలంకరించి, దీపదానం చేయటం కూడా సంప్రదాయంలో భాగం. లక్ష్మీపూజ, గోసేవ, దీపారాధన, దీపదానం, పితృదేవతారాధన ఇవన్నీ ధన త్రయోదశి ప్రత్యేకతలు.