భారతావనికి ఎందరో వచ్చారు..శతాబ్దాలపాటు ఇక్కడ హుకుం చేశారు!దోచుకున్నంత దోచుకున్నారు!మనకు బతకడం చేతకాదని గేలి చేశారు. ఇక్కడి వాళ్లకు కట్టూబొట్టూ, నాగరికత నేర్పిందే తామని చరిత్ర రాసుకున్నారు.కానీ, మన వైభవం ఏనాటిదో చాటి చెప్పింది సింధూ నాగరికత. వేల సంవత్సరాల కిందట వందల ఏండ్లు కొనసాగిన సింధూ వైభవం.. ప్రపంచానికే పాఠం. నేటి మన మేటి జీవన విధానానికి మూలం. పరిపాలనలో సూత్రాలు, గృహనిర్మాణంలో చిత్రాలు, వ్యవసాయంలో విధానాలు.. అత్యున్నత జీవనశైలికి ఆలవాలమై, భారతదేశ అస్తిత్వాన్ని చాటి చెప్పిన సింధూ నాగరికత వైభవం వెలుగు చూసి వందేండ్లు అయింది.
ఇది ప్రాచీన భారతదేశ వైభవం సింధూ నాగరికత బయల్పడిన శతాబ్ది సంవత్సరం. అయితే, చాలామందికి మనదేశ చరిత్ర, సంస్కృతి మూలాల గురించి అంతగా తెలియవనే చెప్పుకోవాలి. అసలు భారతదేశ చరిత్ర సింధూ నాగరికతతో మొదలవుతుంది. ఇది దాదాపు ఐదువేల ఏండ్ల ప్రాచీనమైంది. అంటే అంతకుముందు మనుషులు లేరని కాదు.. అదంతా ఆదిమ దశ. వాడిన వస్తువుల ఆధారంగా జీవిత విధానం తెలుసుకోవాల్సిందే! అదే సింధూ నాగరికతలో ప్రజలకు తమదైన పట్టణ ప్రణాళిక, ఆరాధన, లిపి సంప్రదాయాలు ఉన్నాయి.
ఈ నాగరికత ప్రధానంగా సింధూ, దాని ఐదు ఉపనదులు, థార్ ఎడారిలో ఇంకిపోయిన సరస్వతీ నదుల కేంద్రంగా భారత్, పాకిస్తాన్ దేశాల్లో విస్తరించింది. ప్రసిద్ధ నగరాలైన హరప్పా, మొహెంజోదారో దేశ విభజనతో పాకిస్తాన్కు వెళ్లిపోయాయి. గుజరాత్లోని లోథాల్, రాజస్థాన్లోని కాలిబంగన్, హర్యానాలోని రాఖీగఢీ భారత్లో ప్రసిద్ధ స్థలాలు. పురావస్తు వివరాల జోలి అలా ఉంచితే… భారతీయుల ఆరాధనకు సంబంధించిన కోనేరు, పశుపతి రూపంలో శివుడు, అమ్మవారి ఆరాధనకు మూలాలు సింధూ నాగరికతలోనే ఉండటం విశేషం.

వందేళ్లకు ముందు… సరిగ్గా చెప్పాలంటే 1924 సెప్టెంబర్ 20 కంటే ముందు నైలు నది ప్రవహించే ఈజిప్ట్, యూఫ్రటిస్-టైగ్రిస్ నదుల పరీవాహక ప్రాంతమైన మెసపొటేమియా (ఇప్పటి ఇరాక్) వంటి దేశాల్లోని అతికొద్ది నదీ తీర మైదానాలలోనే అత్యంత పురాతనమైన నాగరికతలు మనుగడ సాగించాయని నమ్మేవారు. కానీ, ఆ రోజున అప్పటి భారత పురావస్తు శాఖ అధికారి సర్ జాన్ మార్షల్ ‘ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్’ పత్రికలో ‘ఫస్ట్ లైట్ ఆన్ లాంగ్ ఫర్గాటెన్ సివిలైజేషన్’ (దీర్ఘకాల విస్మృత నాగరికతపై తొలి వెలుగు) అనే వ్యాసం రాశాడు. దీంతో భారతదేశంలో కూడా ప్రపంచ నాగరికతలతో సమానంగా తులతూగిన నాగరికత ఒకటి వర్ధిల్లిందని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది.
ఆ వ్యాసంలో మార్షల్ ఆనాటికి భారత్లో బయల్పడిన రెండు నగరాలు… హరప్పా, మొహెంజోదారో గురించే ప్రస్తావించాడు. ఆ తరువాత గడిచిన వందేండ్లుగా జరుగుతున్న పురావస్తు తవ్వకాల్లో అలాంటివి సుమారు రెండువేల నగరాలు వెలుగు చూశాయి. ఆ నగరాలలో బయల్పడిన పురావస్తు విశేషాల విశ్లేషణ ఈ సింధూ మైదాన ప్రాంతంలో వర్ధిల్లిన నాగరికత ప్రపంచంలోని ఇతర నదీ తీర మైదాన ప్రాంతాలకు వ్యాపించిందని తెలియజేసింది.

ఆ తరువాత ఈ వందేండ్ల కాలంలో ఈ నాగరికతకు చెందిన వందలాది నగరాలు వెలుగు చూశాయి. 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోవడం వల్ల రెండు దేశాల్లోనూ ఇప్పటివరకు సుమారు 1500 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపారు. భారతదేశంలో సింధూలోయ నగరాలు సరస్వతి, తపతి, నర్మద, గోదావరి నదుల లోయల్లో కూడా విస్తరించాయని తెలిసింది. ఇంకా దక్షిణంగా కేరళలోని నీల నది, తమిళనాడులోని వైగై నది ప్రాంతాల వరకూ ఈ నాగరికత విస్తరించిందని కూడా వాదనలు ఉన్నాయి. ఉత్తర దిశలో టిబెట్లోని కైలాస పర్వతం వరకూ ఈ నాగరికత వ్యాప్తి చెందిందనీ పేర్కొంటారు. ఒక రకంగా చెప్పాలంటే సింధూ లోయ నాగరికత అని తొలుత పేర్కొన్న నాగరికత క్రమంగా భారతదేశం అంతటా విస్తరించిందని తెలియవస్తున్నది.