వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకుని కాస్తంత నెయ్యి దట్టించి, ఓ ముద్ద లాగిస్తే నాసామిరంగా ఆ మజాయే వేరు.. నెయ్యి ఆహారం రుచిని మార్చడమే కాకుండా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. శరీరాన్ని బలంగా తీర్చిదిద్దుతుంది.. ఇది పరిశోధనలో తేలిన సంగతి.. నిపుణులు వెలిబుచ్చిన అభిప్రాయం..
నెయ్యిలో ఉండే బ్యూటరేట్ అనే రసాయనం వల్ల అది వాపును తగ్గిస్తుందని చెబుతున్నారు. కీళ్ల సమస్యల నుంచి గుండెజబ్బుల వరకు ఈ ఇన్ఫ్లమేషనే కారణం అవుతూ ఉంటుంది. నెయ్యి వల్ల లావు అవుతారన్నది అపోహే! పైగా ఇందులో ఉండే కాంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ అనే రసాయనం ఒంట్లోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, ఊబకాయాన్ని నియంత్రిస్తుందని తేలింది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు, రక్తప్రసరణకూ మేలుచేస్తాయి. మధుమేహాన్ని కలిగించే ట్రైగ్లిజరైడ్స్ను అదుపులో ఉంచుతాయి. కళ్లకు, మెదడుకు మేలుచేస్తాయి. అరుదుగా లభించే విటమిన్ కె నెయ్యిలో ఉంటుంది. అలా నెయ్యి చర్మానికి మేలుచేస్తుంది. చర్మం మృదువుగా ఉండేందుకు, ముడతలు పడకుండా యవ్వనంగా కనిపించేందుకు, పైపూతగా రాసినప్పుడు గాయాలు మానేందుకు సాయపడుతుంది. నెయ్యి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుందని, మరీ ముఖ్యంగా పెద్ద పేగులు ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుందని పరిశోధనలు తేల్చాయి. పదార్థాలను వేయించినప్పుడు యాక్రిలమైడ్ అనే ఓ హానికారక రసాయనం ఉత్పన్నం అవుతుంది. అది క్యాన్సర్ సహా రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందనే భయం ఉంది. అదే నేతిలో కనుక వేయిస్తే ఈ కెమికల్ ఉత్పన్నం కాదని మెడికల్ జర్నల్స్ ఒప్పుకొంటున్నాయి.
- ప్రతి రోజు మీ ఆహారంలో నెయ్యి ఉండేలా చూసుకోండి..
- డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదు అంటున్న నిపుణులు..
- నెయ్యిలోని ధాతువులు మీ శక్తిని రెట్టింపు చేస్తాయి..

నెయ్యి… మాట వింటేనే భారతీయులకు నోరూరిపోతుంది. ప్రాంతంతో పనిలేదు, అస్తిత్వంతో పోలిక లేదు. పొగలు కక్కే అన్నానికి తోడు ఇంకేమీ లేకపోయినా… ఓ చుక్క నెయ్యి జోడిస్తే అది పంచభక్ష్య పరమాన్నాలకు పర్యాయపదంగా మారిపోతుంది. ఆహారంలోనే కాదు అగ్నిదేవత ద్వారా తన ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవాలని అనుకునే భక్తులకు, హోమగుండంలో వేసి పదార్థాలు భగ్గున మండుతూ స్వాహాదేవికి చేరాలంటే ఘృతమే ఆధారం.
ఒక్కో ఇంధనం ఇచ్చే వెలుగు ఒక్కోలా ఉంటుంది. దాని నుంచి వెలువడే కాంతి, సువాసనలు వేర్వేరు అనుభూతులను ఇస్తాయి. వీటిలో నెయ్యిదే పైచేయి అని నమ్ముతారు. అందుకే నెయ్యితో పెట్టే దీపం శ్రేష్ఠమని చెబుతారు. ఇక నైవేద్యాల సంగతైతే చెప్పనక్కర్లేదు. కొన్ని ఆలయాల పేరు వినగానే గుర్తుకు వచ్చే ప్రసాదాల నుంచి ఇంటి దగ్గర చేసుకునే నైవేద్యాల వరకు నేతికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలుసు. మన భౌతిక జీవనానికి ఆలంబన అయిన ఆహారంలోను, ఆధ్యాత్మిక జీవితాన్ని సూచించే ధూపదీపనైవేద్యాలలోనే కాదు… వైద్యంలోనూ నెయ్యికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. ఎంత చెప్పుకొన్నా తరగని నేతి పురాణాన్ని ఓసారి తల్చుకుందాం!
మనిషికితెలివి రావడంతోనే ఇల్లు కట్టేసుకోలేదు, కుటుంబాన్ని ఏర్పర్చుకోలేదు. వేల ఏళ్లపాటు సంచార జీవితం గడిపాడు. ముందు పంటలు పండించడం నేర్చుకున్నాడు. సాగులో సాయం కోసం పశువులను మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు మొదలైంది నాగరికత. ఇంటింటా ఎంతోకొంత పశుసంపద ఉండేది. పొలం పనులలో ఉపయోగపడటంతోపాటు… వాటినుంచి పాలు, పెరుగు, నెయ్యి సమృద్ధిగా లభించేవి. అందుకే పశువులు చేసిన మేలుపట్ల కృతజ్ఞత ఎన్నో సంప్రదాయాల్లో, క్రతువుల్లో కనిపిస్తుంది. వ్యవసాయ ఆధారంగా ఎదిగిన మనదేశంలో ‘పాడి’కి ఉన్న ప్రాధాన్యత ఇంకాస్త ఎక్కువే. అందుకేనేమో ప్రపంచంలో ఎక్కువ నెయ్యిని ఉత్పత్తి చేసేది మనమే.
దాన్ని ఎక్కువగా వినియోగించేదీ మనమే. కానీ చిత్రం ఏమిటంటే… నెయ్యికి మన ఆహారంలో ఉన్న ప్రాధాన్యతను వేల ఏళ్లుగా గుర్తించిన మనం, బయటినుంచి కొన్ని వాదనలు వినిపించగానే దానిని పక్కన పెట్టేయడం మొదలుపెట్టేశాం. మితంగా నెయ్యి మంచిదని పదేపదే మొత్తుకున్న మన పెద్దల మాటల్ని విస్మరించాం. కానీ ఇప్పుడు అదే పాశ్చాత్య లోకం నెయ్యిని ‘సూపర్ ఫుడ్’ అంటున్నది. ఇప్పటికీ మించిపోయింది లేదు. ప్రస్తుతం ఇతర సూపర్ మార్కెట్లలో దొరికే ఖరీదైన ఆహార పదార్థాల ఖర్చులతో పోలిస్తే నెయ్యికి అయ్యే వ్యయం పెద్దదేమీ కాదు. అందుకే కాస్తంత నెయ్యికి మన ఇంట్లో కొంచెమంత చోటిద్దాం. ఇంకాస్త ఆరోగ్యాన్ని మనం ఒంట్లో పెంచుకుందాం!

వేర్వేరు పాల నుంచి తీసిన నెయ్యికి వేర్వేరు గుణాలు ఉంటాయి. వాటిని చూస్తేనే ఏ రకం నెయ్యో గుర్తుపట్టవచ్చు. ఆవునెయ్యిలో ఉండే బీటా కెరోటిన్ వల్ల అది పసుపు పచ్చగా కనిపిస్తుంది. గేదె నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాల వల్ల అది తెల్లగా ఉంటుంది. ఇక మేక నెయ్యి పలుకులుగా కనిపిస్తుంది. ఇక వీటిలో కూడా రకరకాలు ఉంటాయి. దేశవాళీ ఆవుల నుంచి వచ్చే నెయ్యిని A1 నెయ్యిగా పిలుస్తుంటారు. గిర్, సాహివాల్ లాంటి కొన్ని ప్రత్యేకమైన జాతుల నుంచి వచ్చే నెయ్యిని A2 గా పిలుస్తారు. ఇందులో బీటా కేసిన్ అనే పోషకం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన ఆరోగ్యానికి కొన్ని అదనపు ప్రయోజనాలు ఉండటంతో పాటు, జీర్ణవ్యవస్థకు కూడా మంచిదని చెబుతారు.
కొంతమంది ఆవునెయ్యి త్వరగా జీర్ణం కాదని అనుమానపడుతుంటారు. ఇలాంటివాళ్లు A2 నెయ్యిని వాడవచ్చు. కాకపోతే మిగతా రకాలతో పోలిస్తే ఇది కొంచెం ఖరీదు ఉంటుంది. ఇక నెయ్యి తయారుచేసే విధానంలోనూ రకరకాల మార్పులు ఉంటాయి. పాల నుంచి తీసిన వెన్నను సన్నటి సెగ మీద కాచి చల్లార్చే ప్రక్రియ మన ముందు తరం వరకూ ఇంటింటా కనిపించేది. ఈ విధానంలో పోషకాలు ఎక్కువ నష్టపోకుండా, కల్తీ జరగకుండా, వాసన చెడకుండా నెయ్యి తయారవుతుంది. పశువుల మేతలోనూ జాగ్రత్తలు తీసుకుని ఆర్గానిక్ నెయ్యి అని అమ్ముతున్నారు. ఎలాగైతే తేనెటీగలు పెరిగే ప్రాంతంలో పూలను బట్టి వాటికి రుచి వస్తుందో… వేర్వేరు మేతలతో ఆవులను పెంచుతుండటంతో గ్రెయిన్ ఫెడ్, గ్రాస్ ఫెడ్ అంటూ రకరకాల నెయ్యి అందుబాటులో ఉంటున్నది. మన శరీర తత్వం, పాత అలవాట్లు, బడ్జెట్ను బట్టి కావల్సిన నెయ్యిని ఎంచుకోవడమే!
ఘృతం అని పిలుచుకునే నెయ్యికి ఆయుర్వేదంలో ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆహారంలో సూపర్ ఫుడ్ అయితే, ఆయుర్వేదంలో సూపర్ మెడిసిన్గా దీన్ని భావించవచ్చు. చరక సంహిత, అష్టాంగ హృదయం లాంటి ప్రామాణిక ఆయుర్వేద గ్రంథాలలో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరికీ ఎన్ని రకాలుగా ఈ ఘృతం ఉపయోగపడుతుందో స్పష్టంగా చెప్పారు. అప్పుడే కాచిన నెయ్యి దగ్గర నుంచీ ఏడాదిపాటు నిల్వ ఉంచిన నెయ్యి వరకూ వివిధ చికిత్సలలో ఎలాంటి నెయ్యిని వాడాలో చెప్పుకొచ్చారు.

చర్మంలో మలినాలను తొలగించే అభ్యంగం, ఒంట్లోని దోషాలను పరిహరించే పంచకర్మ, కంటి సమస్యలకు ఉపయోగించే నేత్ర తర్పణం లాంటి చికిత్సలలో నేరుగా నెయ్యిని వాడతారు. మన శరీరంలో ఏర్పడే ఎన్నో సమస్యలకు కారణం వాత, పిత్త, కఫ దోషాలలో వచ్చే మార్పులే అని ఆయుర్వేదం చెబుతుంది. ఈ త్రిదోషాల స్థాయిని నియంత్రించడంలో నెయ్యిది ముఖ్యపాత్రగా భావిస్తుంది. బ్రాహ్మి, అశ్వగంధ, వాస, మహాతిక్తక… ఇలా వేర్వేరు ఔషధాలను ఘృతంతో కలిపి వాడినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఉదాహరణకు మహాతిక్తక ఘృతం చర్మసంబంధమైన ఎన్నో మొండి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.
ఇన్నాళ్లూ నెయ్యి తినవద్దు అని మన తరాల అలవాటును తక్కువ చేసిన పాశ్చాత్యులే ఇప్పుడు అందులో ఉన్న లాభాలను చూసి ముచ్చటపడిపోతున్నారు. ఏ కారణాల వల్ల అది ఎలాంటి ప్రయోజనాన్ని అందిస్తుందో చెప్పుకొస్తున్నారు.